షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ
ప్లే ఆఫ్స్ మినహా 56 మ్యాచ్లతో లిస్ట్
మరో 12 రోజుల్లో ఐపీఎల్ 13
అనుమానాలకు పుల్స్టాప్ పడింది. నిరీక్షణకు తెరపడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదమూడో ఎడిషన్ నిర్వహణలో కీలక అంకం ముగిసింది. ధనాధన్ లీగ్లో ఏ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో తెలిసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మెగా లీగ్ షెడ్యూల్ వచ్చేసింది. ప్లే ఆఫ్స్ మినహా పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ ఆదివారం రిలీజ్ చేసింది. సంప్రదాయం ప్రకారం గత సీజన్ విన్నర్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరుతోనే ఈ సీజన్ కూడా షురూ కానుంది. ఈ నెల 19వ తేదీన అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగే ఈ హై వోల్టేజ్ ఫైట్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఐపీఎల్13 మరో 12 రోజుల్లోనే..!!
న్యూఢిల్లీ: కరోనా ముప్పులోనూ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ 2020 ముస్తాబవుతోంది. కరోనా కారణంగా ఈసారి యూఏఈలో ధనాధన్ మోత మోగనుంది. ఇప్పటికే అన్ని జట్లూ ఎడారి దేశంలో అడుగుపెట్టి ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఉత్కంఠ కు తెరదించిన బీసీసీఐ ఎట్టకేలకు షెడ్యూల్ రిలీజ్ చేయడంతో లీగ్ కు మార్గం సుగమమైంది. తొలి మ్యాచ్ విషయంలో కూడా అనుమానాలకు తెరపడింది. లీగ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ ఫైట్ జరగనుంది. చెన్నై టీమ్లో ఇద్దరు ప్లేయర్లు సహా 13 మంది కరోనా బారిన పడడం, ఆ జట్టు వారం ఆలస్యంగా ప్రాక్టీస్ ప్రారంభించింది. దాంతో, ఆ జట్టు తొలి మ్యాచ్ ఆడబోదన్న అనుమానాలు నెలకొన్నాయి. అలాగే, షెడ్యూల్ను పాక్షికంగా రిలీజ్ చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ, వాటికి తెరదించిన బోర్డు.. ప్లే ఆఫ్స్ మినహా 56 లీగ్ మ్యాచ్లతో కూడిన ఫూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసింది. వరల్డ్ బిగ్గెస్ట్ టీ20 లీగ్కు ఈసారి యూఏఈలోని దుబాయ్ (దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం), అబుదాబి (షేక్ జాయెద్ స్టేడియం), షార్జా (షార్జా క్రికెట్ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అబుదాబిలో ఫస్ట్ మ్యాచ్ అనంతరం యాక్షన్ దుబాయ్కు షిఫ్ట్ అవుతుంది. తర్వాతి రోజు(20వ తేదీ) ఢిల్లీ క్యాపిటల్స్ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఎదుర్కొంటుంది. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య థర్డ్ మ్యాచ్. ఆపై యాక్షన్ షార్జాకు వెళ్తుంది. ఈ నెల 22న చెన్నై సూపర్ కింగ్స్తో రాజస్తాన్ రాయల్స్ పోటీ పడుతుంది. ఇక, ఈ సారి లీగ్లో 10 డబుల్ హెడర్స్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్లు మధ్యాహ్నం 3.30 గంటలకు, సెకండ్ మ్యాచ్లు రాత్రి 7.30 గంటలకు షురూ అవుతాయి. డబుల్ హెడర్స్ చూసేందుకు రెండు వారాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 3వ తేదీన మొదటి డబుల్ హెడర్ ఉంటుంది. మూడు వేదికల్లో దుబాయ్కు హైయెస్ట్గా 24 మ్యాచ్లు కేటాయించారు. అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్లు ఉంటాయి. ప్లే ఆఫ్స్ వేదికలు, తేదీలను తర్వాత ప్రకటిస్తారు. నవంబర్ 10న ఫైనల్ ఉంటుంది. కాగా, అవసరమైతే షెడ్యూల్లో మార్పులు చేస్తామని బోర్డు పేర్కొంది.