- 14 ఏండ్లు దాటి..15 ఏండ్ల వయసులోపు వారికే టీకా స్కూళ్లలో, ఇంటింటి సర్వే ద్వారా పంపిణీ
- ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తి
- రాష్ట్రంలో ఏటా 4 వేల మంది మహిళలకు సర్వైకల్ క్యాన్సర్
- వ్యాధి రాకముందే అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్) ముప్పు నుంచి మహిళలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్యాన్సర్ నుంచి వారికి విముక్తి కల్పించేందుకు ఉచితంగా టీకాలు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర సర్కార్ 14 ఏండ్లు నిండి 15 ఏండ్లలోపు కిశోర బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల మంది బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయనుంది. అయితే, బయట మార్కెట్లో వేల రూపాయలు పలికే ఈ టీకాను.. ఫ్రీగా ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా టార్గెట్ను ఫిక్స్ చేసిన ఆఫీసర్లు.. వ్యాక్సిన్ పంపిణీ చేసే సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది.
మళ్లీ మైక్రో ప్లానింగ్ సర్వే ద్వారా గుర్తింపు..
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 14 ఏండ్లు నిండి.. 15 ఏండ్ల లోపు ఉన్న బాలికలు సుమారు 4.60 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర జనాభాలో వీరు 1 శాతంగా ఉన్నారు. అయితే, విద్యా శాఖ లెక్కల ప్రకారం సుమారు 3.50 లక్షల మంది ఉన్నారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్కు ముందు మైక్రో ప్లానింగ్ సర్వే ద్వారా.. స్కూళ్లలో, స్కూల్ బయట ఎంత మంది బాలికలు ఉన్నారో గుర్తించి.. వ్యాక్సినేషన్ చేయనున్నారు.
అమ్మాయిలు యుక్తవయసులోకి వచ్చిన కొత్తలో.. అంటే పెళ్లికి ముందు, లైంగిక జీవితం ప్రారంభం కాకముందే ఈ టీకా ఇస్తే ఫలితం వంద శాతం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ వయసులో పిల్లల్లో రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుంది. ఒక్కసారి టీకా తీసుకుంటే భవిష్యత్తులో ఆ వైరస్ దరిచేరదంటున్నారు. గర్భిణులు, గతంలో అలర్జీలు ఉన్నవారికి, ఇప్పటికే ప్రైవేట్లో టీకా తీసుకున్న వారికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
ప్రైవేట్లో వేలల్లో వ్యాక్సిన్ రేటు..
కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం.. రాష్ట్రంలో ఏటా 4 వేల మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వ్యాధి ముదిరేదాకా లక్షణాలు బయటపడకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి ముందస్తుగా వాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గమని చెప్తున్నారు.
అయితే, హెచ్పీవీ వ్యాక్సిన్ రేటు రూ.వేలల్లో ఉంటుంది. ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ధర పలుకుతుంది. దీనికితోడు డాక్టర్ ఫీజులు అదనం. పూర్తి కోర్సు తీసుకోవాలంటే సామాన్యుడికి భారం కానున్నది. పేద, మధ్యతరగతి ప్రజలకు మోయలేని భారం కానుండటంతో పిల్లలకు వ్యాక్సిన్ వేయించని పరిస్థితి ఉండదని గుర్తించిన ప్రభుత్వం.. ఫ్రీగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.
వైరస్ వల్ల క్యాన్సర్ వ్యాధి..
సర్వైకల్ క్యాన్సర్ వంశపారంపర్యంగా రాదని, హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వల్ల వస్తుందని వైద్యులు చెప్తున్నారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, ఎక్కువసార్లు ప్రసవాలు కావడం దీనికి కారణాలంటున్నారు. అలాగే, లైంగిక సంబంధాల వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. వైరస్ సోకిన వెంటనే క్యాన్సర్ రాదని, 10 నుంచి 15 ఏండ్ల తర్వాత ఇది బయటపడుతుందని చెబుతున్నారు. దీంతో ఈ వాక్సిన్ తీసుకుంటే ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించడానికి ముందే అడ్డుకుంటుందన్నారు. 30 ఏండ్లు దాటిన మహిళలు మాత్రం ఐదేండ్లకోసారి పాప్ స్మియర్ టెస్టు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
