- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
- బీజేపీకి పూర్తి మెజారిటీ లేదని కామెంట్
వేములవాడ, వెలుగు: కరీంనగర్ మేయర్ పదవిని కాంగ్రెస్గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు, ఇందుకు రాజకీయంగా తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా వేములవాడలో రాజన్నను దర్శించుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరి వ్యూహం వారికి ఉంటుందని చెప్పారు. 66 మంది ఓటర్లున్న కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి 30 మంది సభ్యులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.
అయినప్పటికీ, తామే మేయర్ పదవిని గెలుచుకుంటామని కేంద్రమంత్రి ప్రకటించుకున్నారని, వారి ప్రయత్నాలకు తాము అడ్డు పడడంలేదని వెల్లడించారు. మెజారిటీ లేని బీజేపీ ఇండిపెండెంట్లను కలుపుకోవడం అనైతికం కాదా..? అని ప్రశ్నించారు.
నిజామాబాద్ లో బీజేపీ 28 చోట్ల గెలిచినా మొజారిటీ లేదని, తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని అక్కడి ఎంపీ ప్రకటించారని గుర్తు చేశారు. సంజయ్ కూడా అలాంటి ప్రకటన చేస్తే బాగుండేదని వివరించారు. గతంలో తాము 13 కార్పొరేటర్ సీట్లు గెలిచినప్పుడు కూడా మేయర్ అయ్యామని, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తామని వెల్లడించారు.
