టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలను ఆ దేశ అధికారులు తీవ్రంగా ఖండించారు. పెరుగుతున్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రభావం, విభేదాల కారణంగా ఆయన తప్పుకోవాలని చూస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. యూకేకు చెందిన ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ అనే మీడియా సంస్థ మొదట ఈ వార్తను ప్రచురించింది. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కార్యాలయానికి పెజెష్కియాన్ తన రాజీనామా లేఖను పంపినట్లు ఆ సంస్థ క్లెయిమ్ చేసింది.
అయితే, అధ్యక్షుడు రాజీనామా చేయలేదని, ఆయన యథావిధిగా తన విధులను నిర్వర్తిస్తున్నారని ఉన్నతాధికారులు చెప్పినట్టు ఐఆర్జీసీ అనుబంధ వార్తా సంస్థ ‘తస్నిమ్’ కథనాన్ని వెల్లడించింది. కాగా, ఇరాన్ అధ్యక్షుడి కార్యాలయ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డిప్యూటీ హెడ్ ‘సయ్యద్ మెహదీ తబాతబాయ్’ ఎక్స్ వేదికగా ఈ వార్తలను కొట్టిపారేశారు. ‘‘విదేశీ నెట్వర్క్ ప్రసారం చేస్తున్న ఈ పుకార్లు వారి ఊహాజనిత ఆలోచనలే తప్ప ఇందులో వాస్తవం లేదు. గతంలో వారు ఆడిన మీడియా ఆటల కొనసాగింపే ఇది” అని ఆయన మండిపడ్డారు.
