సింహాసనంపై కూర్చునేది మగాళ్లు మాత్రమే : ఆడవాళ్లకు అవకాశం లేకుండా చట్ట సవరణ

సింహాసనంపై కూర్చునేది మగాళ్లు మాత్రమే : ఆడవాళ్లకు అవకాశం లేకుండా చట్ట సవరణ

జపాన్ ప్రభుత్వం  దేశ రాజ వారసత్వ చట్టాలలో కొన్ని కీలక మార్పులు చేసింది. అంతరించిపోతున్న రాజకుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ సరికొత్త చట్టాన్ని జపాన్ పార్లమెంట్ ఆమోదించింది. అయితే, ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించినప్పటికీ, మహిళలు చక్రవర్తులు (మహిళా రాణులు) కావడానికి మాత్రం ఈ కొత్త చట్టంలో అనుమతి ఇవ్వలేదు. సింహాసనం కేవలం మగవారికేనని స్పష్టం చేసింది.

 కొత్త చట్టంలో మార్పులు ఏంటి
జపాన్ పార్లమెంట్ ఎగువ సభ ఆమోదించిన ఈ కొత్త చట్టం ప్రకారం... రాజకుటుంబానికి చెందిన మహిళలు సామాన్యులను పెళ్లి చేసుకున్నా సరే.. వారి రాజరిక హోదా పోదు (గతంలో సామాన్యులను పెళ్లి చేసుకుంటే రాజకుటుంబం నుండి బయటకు పంపేవారు). పూర్వం రాజకుటుంబంలో ఉండి విడిపోయిన శాఖల నుండి కేవలం అవివాహిత మగపిల్లలను మాత్రమే తిరిగి దత్తత తీసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు.

కానీ, 1947 నాటి ఇంపీరియల్ చట్టాన్ని అలాగే ఉంచారు. దీని ప్రకారం తండ్రి వైపు నుండి మగ రక్తసంబంధం ఉన్న పురుషులు మాత్రమే జపాన్ చక్రవర్తి కావడానికి అర్హులు.

ముంచుకొస్తున్న వారసుల కొరత
ప్రస్తుతం జపాన్ రాజకుటుంబంలో మగ వారసుల కొరత తీవ్రంగా ఉంది. రాజకుటుంబంలో మొత్తం 16 మంది ఉంటే, వారిలో కేవలం ఐదుగురు మాత్రమే పురుషులు ఉన్నారు.

ప్రస్తుతం జపాన్ రాజకుటుంబ భవిష్యత్తు అంతా ప్రస్తుత చక్రవర్తి నరుహితో మేనల్లుడైన 19 ఏళ్ల యువరాజు హిసాహితో చేతుల్లోనే ఉంది. సింహాసనాన్ని అధిష్టించే వయసున్న ఏకైక మగ వారసుడు ఇతనే.

ఒకవేళ భవిష్యత్తులో యువరాజు హిసాహితోకు కుమారుడు పుట్టకపోతే, జపాన్‌కు తదుపరి చక్రవర్తి దొరకడు. రాజవంశం ఉనికికే ముప్పు వాటిల్లుతుంది.

ఈ కొత్త చట్టం ప్రకారం.. ప్రస్తుత చక్రవర్తి నరుహితో కుమార్తె అయిన 24 ఏళ్ల యువరాణి ఐకోకు ప్రజల్లో ఎంతో మంచి పేరున్నప్పటికీ ఆమె సింహాసనాన్ని అధిష్టించే అవకాశం లేదు.

  తీవ్ర చర్చలు.. భిన్నాభిప్రాయాలు
జపాన్ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి సనాయ్ తకైచీ నేతృత్వంలో మహిళా వారసత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, సొంత పార్టీలోనే కొందరు దీనిని వ్యతిరేకించారు. యువరాణి ఐకోను పక్కన పెట్టడం పూర్తిగా అన్యాయమని సీనియర్ నేత సెయిచిరో మురకామి విమర్శించారు.

మరోవైపు, బయటి వ్యక్తులను దత్తత తెచ్చుకోవడంపై మాజీ రాజవంశీకుడు అసహిరో కునీ అసంతృప్తి వ్యక్తం చేశారు. "సాధారణ పౌరులుగా పెరిగిన వారు హఠాత్తుగా వచ్చి రాజకుటుంబ కఠినమైన నియమాలకు అలవాటు పడటం అంత తేలిక కాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

 72 శాతం మంది ప్రజలు మహిళలకే  
రాజకుటుంబ సంప్రదాయాలు ఎలా ఉన్నా, జపాన్ ప్రజలు మాత్రం ఆధునిక ఆలోచనలతో ఉన్నారు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో 72 శాతం మంది ప్రజలు మహిళలు కూడా జపాన్ సింహాసనాన్ని అధిష్టించేలా చట్టాలు మార్చాలని కోరుకోవడం విశేషం.