టెహ్రాన్: అంతర్జాతీయ చమురు దౌత్యంలో అమెరికా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ విమర్శించారు. ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొనవద్దని భారత్లాంటి దేశాలను బెదిరించిన యూఎస్.. ఇప్పుడు అదే చమురును కొనాలని ప్రపంచ దేశాలను బతిమిలాడుతున్నదని ఎద్దేవా చేశారు. శనివారం అబ్బాస్ అరఘ్చీ ‘ఎక్స్’లో అమెరికా వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపివేయాలని గత కొన్ని నెలలుగా భారత్ను అమెరికా వేధించింది. కానీ ఇరాన్తో యుద్ధం మొదలైన రెండు వారాలకే.. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలను అదుపు చేయడానికి రష్యా ముడి చమురును కొనాలని అదే అమెరికా ఇప్పుడు వేడుకుంటున్నది’’ అని రాసుకొచ్చారు.
యూరప్ దేశాలపై ధ్వజం: అమెరికా అండ చూసుకొని ఇరాన్పై అక్రమ యుద్ధానికి మద్దతు తెలుపుతున్న యూరోపియన్ దేశాల తీరును అబ్బాస్ అరఘ్చీ తప్పుపట్టారు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా మద్దతు లభిస్తుందనే ఆశతో యూరోప్ దేశాలు ఇరాన్పై దాడులను సమర్థిస్తున్నాయని, ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం అని మండిపడ్డారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటడం, ఇరాన్ ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్’ను మూసివేయడంతో ప్రపంచ ఇంధన మార్కెట్ సంక్షోభంలో పడింది. దీనిని అదుపు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం రష్యా చమురుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలిస్తూ 30 రోజుల మినహాయింపు ఇచ్చింది. మార్చి 12 లోపు ఓడల్లో లోడ్ అయిన రష్యా చమురును ఏప్రిల్ 11 వరకు అమ్ముకోవచ్చని అమెరికా ట్రెజరీ శాఖ అనుమతించింది.
