చంద్రబాబు బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదా... ఏ కేసులో అంటే

చంద్రబాబు బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదా... ఏ కేసులో అంటే

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధవారానికి (అక్టోబర్ 18)  వాయిదా వేసింది. ఈ పిటిషన్ ను అక్టోబర్ 18న విచారించనున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కు 500 పేజీల వివరణతో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. 

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై గత విచారణ  సందర్భంగా.. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ విషయంలో తదుపరి ముందుకు వెళ్లొద్దని విజయవాడ ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది.ఈనెల 16 వరకు పీటీ వారెంట్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయద్దని తెలిపింది. చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ.. ఈ కేసులో అక్టోబర్ 16 వరకు అరెస్టు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే తాజాగా ఈరోజు హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ విచారణ జరిగింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరఫు లాయర్లు సమయం కోరారు. దీంతో విచారణను బుధవారానికి (అక్టోబర్ 18) వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. 

ఈ కేసు విషయానికి వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్పులు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ,  నారా లోకేష్, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్‌కె హౌసింగ్ లిమిటెడ్‌కి చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామ కృష్ణ హౌసింగ్ ప్రై. లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రై. లిమిటెడ్‌లతో పాటు ఇతరులను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.