కోరుకంటి కొంపముంచిన కొలువుల లొల్లి

కోరుకంటి కొంపముంచిన కొలువుల లొల్లి

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌)లో కాంట్రాక్ట్​ ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలు రామగుండం సిట్టింగ్​ ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ కొంప ముంచాయి. ఫ్యాక్టరీలో ఉద్యోగాలు పెట్టిస్తానని నిరుద్యోగుల వద్ద  చందర్​ అనుచరులు,  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ లీడర్లు లక్షలాది రూపాయలు వసూలు చేశారు. ప్లాంట్‌‌‌‌లో పర్మినెంట్‌‌‌‌ ఉద్యోగావకాశాలు, క్వార్టర్‌‌‌‌ సౌకర్యం, పిల్లలకు ఉచిత విద్య, హాస్పిటల్‌‌‌‌ సౌకర్యం తదితర ఆశలు కల్పించిన ఎమ్మెల్యే చందర్‌‌‌‌ అనుచరులు దళారుల ఆవతారం ఎత్తి చుట్టు పక్క జిల్లాలతో పాటు స్థానికుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశారు.

దళారులు కల్పించిన ఆశలకు విరుద్ధంగా ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌లో పని పరిస్థితులు ఉండడం, ఉద్యోగం పర్మినెంట్‌‌‌‌ కాకపోవడం, కొత్త కాంట్రాక్టర్‌‌‌‌ వచ్చి చాలా మందిని తొలగించడంతో కార్మికులంతా తమ డబ్బులు చెల్లించాలని దళారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే డబ్బులు తిరిగి రాక హుజూరాబాద్‌‌‌‌ ప్రాంతానికి చెందిన ముంజ హరీశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌ కమాన్‌‌‌‌పూర్‌‌‌‌ ప్రాంతంలోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఇష్యూలో పలువురు తమ గ్రామాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

ఇలాంటి ఘటనలకు తోడు చందర్‌‌‌‌ అనుచరులు ఎన్టీపీసీ, ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ సంస్థల నుంచి వచ్చే బూడిదను , గోదావరి నది అంతర్గాం నుంచి ఇసుకను అక్రమ రవాణా చేయడం లాంటి అంశాలు కోరుకంటి చందర్‌‌‌‌ ను ప్రజల్లో పలుచన చేశాయి. సింగరేణిలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అనుబంధ టీబీజీకేఎస్‌‌‌‌ లీడర్లు కార్మికులపై సాగించిన జులుం, వారసత్వ ఉద్యోగాల ఎంపిక విషయంలో జరిగిన అక్రమాలతో కార్మికుల్లోనూ చందర్​ ఇమేజ్​ డ్యామేజీ అయ్యింది!