డిస్కంలకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇండెంట్
హైదరాబాద్, వెలుగు: 2022–23 ఆర్థిక సంవత్సరంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రోజుకు 2,500 మెగావాట్ల చొప్పున కరెంట్ కావాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోరుతోంది. ఈ మేరకు డిస్కంలకు ఇండెంట్ పంపింది. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దేవాదుల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణకు సుమారు 2,500 మెగావాట్ల కరెంట్ డిమాండ్ ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ మేరకు కరెంట్ పంపిణీ చేసేందుకు డిస్కంలు సిద్ధంగా ఉండాలని కోరింది.
7 వేల మెగావాట్లు అవసరమున్నా...
రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వస్తే రోజుకు 12 వేల మెగావాట్ల కరెంట్ అవసరం ఉంటుంది. అయితే పాలమూరు–రంగారెడ్డి ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. వచ్చే ఏడాదికి సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతలు స్టార్ట్ అయ్యే చాన్స్ ఉంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే రోజుకు 3,671 మెగావాట్ల కరెంట్ అవసరం. ఈ ప్రాజెక్టులోని 13 పంపుహౌస్ల్లో 48 మోటార్లు ఒకేసారి నడిపితే ఈ మేరకు కరెంట్ డిమాండ్ ఉంటుంది. మిగతా పంపుహౌస్లు పూర్తయితే మరో వెయ్యి మెగావాట్ల కరెంట్ అవసరమవుతుంది. దేవాదుల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఇతర లిఫ్టులకు ఇంకో 4 వేల మెగావాట్ల కరెంట్ కావాలి. మొత్తంగా 7 వేల మెగావాట్ల పైచిలుకు కరెంట్ అవసరం ఉండగా.. లిఫ్టులకు 2,500 మెగావాట్ల కరెంట్ మాత్రమే కావాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోరింది. కరెంట్ సరఫరా చేసేలా త్వరలోనే డిస్కంలతో ఒప్పందం చేసుకోనుంది. పంపులు నడిపేటప్పుడు ఎనర్జీ చార్జీలు 80%, మిగతా సమయాల్లో 20% చెల్లించేలా అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నట్టు తెలిసింది.