జూరాల ప్రాజెక్ట్కు ముప్పు లేదు ..గేట్లు కూడా బాగున్నయ్: మంత్రి ఉత్తమ్

జూరాల ప్రాజెక్ట్కు ముప్పు లేదు ..గేట్లు కూడా బాగున్నయ్: మంత్రి ఉత్తమ్
  • బీఆర్ఎస్ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నరు
  • రూ.100 కోట్లతో డ్యామ్ పక్కన కొత్త బ్రిడ్జి కడ్తామని వెల్లడి
  • జూరాల ప్రాజెక్ట్, ర్యాలంపాడు రిజర్వాయర్ పరిశీలన

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్ట్‌‌‌‌కు, గేట్లకు ఎలాంటి ముప్పు లేదని ఇరిగేషన్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో చెడు జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని విమర్శించారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌‌‌‌రెడ్డితో కలిసి జోగులాంబ గద్వాల జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. ముందుగా ధరూర్‌‌‌‌ మండల పరిధిలోని నెట్టెంపాడు లిఫ్ట్‌‌‌‌లో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్‌‌‌‌ను పరిశీలించారు.

అనంతరం జూరాల ప్రాజెక్ట్‌‌‌‌ను పరిశీలించి వివరాలడిగి తెలుసుకున్నారు. తర్వాత గద్వాల కలెక్టరేట్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘జూరాల ప్రాజెక్ట్‌‌‌‌ పక్కనే రూ.100 కోట్లతో బ్రిడ్జి కం చెక్‌‌‌‌డ్యామ్‌‌‌‌ నిర్మిస్తాం. దీని కోసం ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల చేస్తాం. పదేండ్ల బీఆర్ఎస్‌‌‌‌ పాలనలో ఇరిగేషన్‌‌‌‌ శాఖ భ్రష్టు పట్టిపోయింది. కొత్త ప్రాజెక్ట్‌‌‌‌లు కట్టకపోగా ఉన్న పాతవాటికి రిపేర్లు చేయకపోవడంతో అవి మూలకు పడే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ప్రాజెక్ట్‌‌‌‌లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

జూరాల ప్రాజెక్ట్‌‌‌‌కు మరో గ్యాంటీ క్రేన్‌‌‌‌ కావాలని దశాబ్దకాలంగా డిమాండ్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. జూరాల ప్రాజెక్ట్‌‌‌‌కు మూడున్నర కోట్లతో గ్యాంటి క్రేన్‌‌‌‌ను ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌ చేస్తాం. ర్యాలంపాడ్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ రిపేర్లు పూర్తి చేసి 4 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చూస్తాం’’అని ఉత్తమ్ అన్నారు. రూ.2,753 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేషన్లతో నెట్టెంపాడు పనులను డిసెంబర్‌‌‌‌ నాటికి కంప్లీట్ చేస్తామని తెలిపారు. మక్తల్‌‌‌‌ నియోజకవర్గంలో బీ6 ప్రాజెక్ట్‌‌‌‌తో పాటు పెండింగ్‌‌‌‌లో ఉన్న ఇరిగేషన్‌‌‌‌ పనులను కూడా కంప్లీట్‌‌‌‌ చేస్తామన్నారు.

తప్పుడు ప్రచారం చేస్తున్నరు: మంత్రి వాకిటి శ్రీహరి

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. ఈ సీజన్‌‌‌‌లో జూరాలకు ముందుగానే వరద వచ్చిందని, దీంతో గేట్ల రిపేర్లకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. ప్రాజెక్ట్‌‌‌‌ దగ్గర ఏం జరగకపోయినా భయానక వాతావరణం సృష్టించి లబ్ధి పొందేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌‌‌‌ కుమార్‌‌‌‌, జడ్పీ మాజీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ సరిత తిరుపతయ్య, సీఈ సత్యనారాయణరెడ్డి, ఆఫీసర్లు శ్రీనివాస్, ప్రమీల, రహిముద్దీన్‌‌‌‌ పాల్గొన్నారు.