Baahubali 3: మరోసారి మహిష్మతి గర్జించబోతోందా? ప్రభాస్, రానా, అనుష్క హింట్‌తో బాహుబలి 3పై క్లారిటీ!

Baahubali 3: మరోసారి మహిష్మతి గర్జించబోతోందా? ప్రభాస్, రానా, అనుష్క హింట్‌తో బాహుబలి 3పై క్లారిటీ!

భారతీయ సినీ చరిత్రలో మోస్ట్ పవర్ ఫుల్ ఫ్రాంచైజీల్లో ‘బాహుబలి’ (Baahubali) ఒకటి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన  ‘బాహుబలి’ రెండు భాగాలు తెలుగు సినిమా అవతారాన్నే మార్చేసాయి. జక్కన్న అల్లుకున్న కథనం స్థాయిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడమే కాకుండా, మహిష్మతి అనే చిరస్మరణీయమైన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇప్పటికీ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ సిరీస్‌కు మూడో భాగం వస్తుందా? అనే ప్రశ్న ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికే సమయం దగ్గరపడిందేమో అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్గా జక్కన్న బాహుబలి ప్రపంచం గురించి స్టార్స్ ప్రభాస్, రానా, అనుష్క ఇంట్రెస్టింగ్ హింట్స్ ఇచ్చి అభిమానుల్లో అంచనాలు పెంచారు. 
 
బాహుబలి 3 రానుందా..?

ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ (Baahubali: The Torchbearer) చివరి భాగంలో జరిగిన ఓ సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నటుడు రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ‘‘ప్రపంచం ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు.. కానీ బాహుబలి మాత్రం..’’ అంటూ మధ్యలో ఆపేయగా, వెంటనే ప్రభాస్ చిన్న చిరునవ్వుతో మూడు వేళ్లు చూపించారు. ఇక ఆ పక్కనే ఉన్న అనుష్క శెట్టి కూడా నవ్వుతూ స్పందించారు. వీడియో చివర్లో ‘లెగసీ కొనసాగుతుంది!’ అనే మెసేజ్ కూడా కనిపించడంతో.. ఇది బాహుబలి 3కు సంబంధించిన హింట్ అని సినీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో బాహుబలి 3 నిజంగానే రానుందా? అనే ఆసక్తి మాత్రం అభిమానుల్లో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే బాహుబలి 3 ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కథ ఎలా ఉండబోతోంది? సినిమా రూపంలో వస్తుందా లేదా వెబ్ సిరీస్‌గా రూపొందుతుందా? వంటి విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు.

ఫ్యాన్స్‌లో పెరిగిన క్యూరియాసిటీ.. 

ఈ వీడియో క్లిప్ బయటకు రావడంతో సినీ ఫ్యాన్స్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.  ‘బాహుబలి 3 రాబోతోంది’ అంటూ సోషల్ మీడియా పోస్టులతో హీటెక్కిస్తున్నారు. ఒక నెటిజన్, ఇండియన్ సినీ హిస్టరీలో గొప్ప చిత్రమైన బాహుబలి మూడో భాగం ఇప్పుడు అధికారికమే’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘బాహుబలి స్వయంగా బాహుబలి 3కి సంకేతాలు ఇచ్చాడు’ అంటూ క్యాప్షన్ ఇస్తున్నారు. మరో అభిమాని, ‘రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క కలిసి బాహుబలి 3 రానుందని పరోక్షంగా అప్డేట్ ఇచ్చారు. ఇక అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.

విశ్వం మొత్తం విస్తరించిన బాహుబలి.. 

‘బాహుబలి’ కేవలం రెండు సినిమాలకే పరిమితం కాలేదు. పుస్తకాలు, యానిమేటెడ్ కంటెంట్, ప్రత్యేక అనుభవాల రూపంలో కూడా ఈ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అయితే అభిమానులందరూ ఎక్కువగా ఎదురుచూస్తున్నది మాత్రం పూర్తి నిడివితో కూడిన బాహుబలి 3 గురించి మాత్రమే. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి తెరకెక్కిస్తున్నాడు. ఈ మైథికల్ ప్రాజెక్ట్‌ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక అప్పటివరకు రాజమౌళి వారణాసి పనుల్లోనే నిమగ్నమై ఉంటారు. ఇక బాహుబలి 3 ఎప్పుడు ప్రారంభిస్తారు? కథ ఏ దిశగా సాగుతుంది? అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? అనే విషయాలపై జక్కన్న క్లారిటీ ఇస్తేనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమవుతుందో!