పద్మారావునగర్, వెలుగు: కరోనా ఒమిక్రాన్కు చెందిన సబ్ వేరియంట్ జేఎన్-–1 విషయంలో దీర్ఘాకాలిక వ్యాధుల పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు సూచించారు. మంగళవారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. వేగంగా వ్యాప్తి చెందే జేఎన్-–1 సబ్ వేరియంట్ వైరస్ ప్రాణాంతకం కాకపోయినా, క్యాన్సర్, టీబీ లాంటి దీర్ఘకాల వ్యాధుల పేషెంట్లు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. గాంధీలో క్యాజువాలిటీ, మెయిన్ బిల్డింగ్లోని లేబర్ వార్డులో ఐసోలేషన్ వార్డులు రెడీగా ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ కొవిడ్ పేషెంట్లకు ట్రీట్ మెంట్ అన్ని వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు.