భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా 2వేల 367 కిలోల బరువున్న భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సిద్ధమవుతున్నారు శాస్త్రవేత్తలు. శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి చేపట్టనున్న ఈ ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో.
జీఎస్ఎల్వీ రాకెట్ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే.. జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ను మూడు దశల్లోనే ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ను నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
ఈ ప్రయోగానికి సంబంధించి షార్లోని రెండో ప్రయోగ వేదిక వద్ద వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను పూర్తి చేసి రాకెట్ను ప్రయోగ వేదికకు తరలించారు. ఈ ప్రయోగానికి సంబంధించి మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశాన్ని సెప్టెంబర్ 1న షార్లో నిర్వహించనున్నారు. ఆ తర్వాత జరిగే లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశంలో ప్రయోగ సమయం, తేదీని అధికారికంగా ప్రకటించనుంది ఇస్రో.
