న్యూఢిల్లీ: ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోమవారం రూ. 785 కోట్ల బ్లాక్ మనీని పట్టుకున్నారు. పుణే బేస్డ్ బిజినెస్ గ్రూప్పై దాడులు చేసి రూ. 335 కోట్ల బ్లాక్ మనీని సీజ్ చేయగా, మధ్యప్రదేశ్లోని ఓ కంపెనీపై దాడులు చేసి రూ. 450 కోట్లను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని 34 లొకేషన్లలో దాడులు చేయడం ద్వారా రూ. 335 కోట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) సీజ్ చేసింది. ఈ గ్రూప్ టొబాకోను అమ్మడం, ప్యాకేజింగ్ బిజినెస్లో ఉంది. వీటితో పాటు పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బిజినెస్లలో కూడా ఈ గ్రూప్ ఉందని సీబీడీటీ పేర్కొంది. రూ. 243 కోట్ల విలువైన పొగాకు సేల్కు సంబంధించి ఎటువంటి రికార్డ్స్ లేవని పేర్కొంది. పొగాకు బిజినెస్లోని డీలర్లపై దాడులు చేయడం ద్వారా లెక్కల్లేని రూ. 40 కోట్ల బ్లాక్ మనీని ఈ బోర్డ్ సీజ్ చేసింది. రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే ఎక్కువ చెల్లించిన/తీసుకున్న రూ. 18 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ గుర్తించామని తెలిపింది. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అమ్మకంపై వచ్చిన రూ. 9 కోట్ల లాభాన్ని లెక్కల్లో చూపలేదని పేర్కొంది.
సోయా ప్రొడక్ట్స్ తయారీ కంపెనీపై దాడులు..
సపరేట్గా బెటుల్ బేస్డ్ సొయా ప్రొడక్ట్స్ మాన్యుఫాక్చరింగ్ గ్రూప్పై జరిపిన సోదాల్లో రూ. 450 కోట్ల బ్లాక్ మనీని ట్యాక్స్ అధికారులు సీజ్ చేశారు. మధ్యప్రదేశ్లోని బెటుల్, సాత్నా, మహారాష్ట్రలోని ముంబై, షోలాపుర్, కోల్కతాలకు దగ్గర్లోని 22 ప్రాంతాలలో సోదాలు జరిపామని సీబీడీటీ తెలిపింది. లెక్కల్లేని రూ. 8 కోట్లను, వివిధ దేశాలకు చెందిన రూ. 44 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీలను, 9 బ్యాంక్ లాకర్లను సీజ్ చేశామని తెలిపింది. కోల్కతాలోని ఒక డొల్ల కంపెనీ ద్వారా రూ. 259 కోట్లను రూటు మార్చాలని ఈ గ్రూప్ చూసిందని సీబీడీటీ పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులను బట్టి లెక్కల్లో లేని రూ. 450 కోట్ల ఇన్కమ్ను గుర్తించామని తెలిపింది. షెల్ కంపెనీల ద్వారా రూ. 90 కోట్లను దాచారని పేర్కొంది. ‘ఈ కంపెనీలలో ఏవి కూడా నడవడం లేదు. ఈ షెల్ కంపెనీల ఐడెంటిటీని గ్రూప్ కూడా కన్ఫార్మ్ చేయలేదు. వీటికి చెందిన డైరక్టర్లను కూడా కన్ఫార్మ్ చేయలేదు. ఈ పేపర్ కంపెనీలలో చాలా వాటిని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తొలగించింది’ అని బోర్డ్ పేర్కొంది.