వెంకయ్యకు రాజ్యసభ వీడ్కోలు

వెంకయ్యకు రాజ్యసభ వీడ్కోలు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి పనిచేయడం తన అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యసభను ఆయన చాలా సమర్ధంగా నడిపించారని కొనియాడారు. యువ ఎంపీలను వెంకయ్య ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. ఈనెల 10న ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ విరమణ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని మోడీ  మాట్లాడారు. వెంకయ్య ప్రసంగంలో నవరసాలు ఉంటాయన్నారు. వెంకయ్య నాయుడు నాయకత్వ దక్షత వల్ల రాజ్యసభ పనితీరు మెరుగుపడిందని, ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని గుర్తు చేశారు.

వెంకయ్య హయాంలో దాదాపు 177 బిల్లులు పాస్ అయ్యాయని ప్రధాని తెలిపారు. మరెన్నో బిల్లులపై రాజ్యసభలో సామరస్యపూర్వక వాతావరణంలో విస్తృత చర్చ కూడా జరిగిందన్నారు. మాతృభాషల పరిరక్షణకు వెంకయ్య నాయుడు చేసిన కృషి ప్రశంసనీయమని మోడీ పేర్కొన్నారు. వెంకయ్య సుదీర్ఘ అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. రాజ్యసభ సక్రమంగా నడిచేందుకు వెంకయ్య నాయుడు ఇచ్చిన మార్గదర్శనం ఎంతో దోహదం చేసిందన్నారు.