
- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మల్హర్, మహాదేవపూర్, కాటారం, వెలుగు: చెప్పిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని, అభివృద్ధి చేతల్లో చూపిస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్, మల్హర్ మండలాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్రావుపల్లి, భూపాలపల్లి వన్ ఇంక్లైన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి నుంచి పెద్దతూండ్ల వరకు రూ.4.70 కోట్లతో నిర్మించనున్న రోడ్లు నిర్మాణంతో ప్రజలకు దూరభారం తగ్గుతుందని మంత్రి తెలిపారు. తాడిచెర్ల కు సంబంధించి భూసేకరణ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారని ఆయనకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మహదేవ్పూర్ లో అర్హులైన 54 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు.
90 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మహదేవపూర్ లో సీఎస్ఆర్ రూ.20 లక్షల నిధులతో, తాడిచెర్లలో రూ.16 లక్షలతో నిర్మించిన చిల్డ్రన్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు. కాటారం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఐదు మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలకు సీఎస్ఆర్ నిధుల నుంచి డ్యూయల్ బెంచిలను పంపిణీ చేశారు. మంథని నియోజకవర్గ వ్యాప్తంగా ఇండ్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు.
తాడిచెర్ల, కాటారం మండలాల్లో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సన్నాహక కార్యక్రమంలో మంత్రి పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, చైర్మన్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.