హైదరాబాద్, వెలుగు:గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల్లో 17 శాతం వృద్ధి సాధించామని మంత్రి కేటీఆర్
చెప్పారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులు, పరిశ్రమల స్థాపనపై ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, కె.పి.వివేకానంద్ , ఆశన్నగారి జీవన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, బిగాల గణేశ్ గుప్తా అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. 2018–19లో ఐటీ ఎగుమతుల జాతీయ సగటు వృద్ధిరేటు 9శాతంగా ఉంటే, తెలంగాణ 17% వృద్ధిరేటు సాధించిందని చెప్పారు. 2013–14లో రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు ఉంటే..2018–19 నాటికి 1,09,219 కోట్లకు చేరిందని తెలిపారు.
హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఐటీ టవర్లు నిర్మిస్తున్నామన్నారు. కరీంనగర్, ఖమ్మం ఐటీ టవర్లు ఎప్పుడు ప్రారంభిస్తారని డి.శ్రీధర్ బాబు ప్రశ్నించగా.. కరీంనగర్ ఐటీ టవర్ ను అక్టోబర్ లో, ఖమ్మం టవర్ ను డి సెంబర్ లో ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. ఐటీఐఆర్ పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పదవీ కాలం 2 నెలల్లో
ముగుస్తుందనగా హైదరాబాద్, బెంగళూర్ లకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ప్రకటించారని, కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మంత్రి పేర్కొన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారులో ఐటీ మంత్రిగా చేసిన రవిశంకర్ ప్రసాద్ .. ఐటీఐఆర్
తమ విధానం కాదన్నారని వివరించారు. అయినా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి ఆగలేదన్నారు.

