మహబూబాబాద్: మరో ఆరునెలల్లో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి శుభవార్త చెబుతారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నిరుద్యోగ భృతి ఇచ్చే సమయం నాటికి కరోన సంక్షోభం వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. రాష్టంలో యువత ఉద్యోగాలు లేక నిరుత్సాహం గా ఉన్నారని, చదువుకున్న వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే కష్టమని అన్నారు. ప్రస్తుతం చదువుకున్న యువత వ్యవసాయ రంగం వైపు మొగ్గుచూపుతున్నారని, వ్యవసాయం దండగ అన్న వారే నేడు వ్యవసాయం పండుగ అని అంటున్నారన్నారు.
కేంద్రం ప్రభుత్వం పంటల కొనుగోలు పై ఆంక్షలు విధిస్తుందన్న ఎర్రబెల్లి.. ఎన్నికల వేళలో సమస్యలు గుర్తుకు వస్తాయి కానీ చేసిన మంచి పనులను విస్మరిస్తారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా పండిన ప్రతి పంటను కొనుగోలు చేయడం లేదని అన్నారు.
రైతులకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. బీజేపీ నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని.. బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని విస్మరించారని అన్నారు. మహబూబాబాద్ జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు