- రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పుల్లగుర్ల రాజిరెడ్డి
హైదరాబాద్సిటీ, వెలుగు: వివిధ ప్రభుత్వ శాఖల్లో తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పుల్లగుర్ల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. 2026–-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, వేతనాలను మధ్యవర్తులు లేకుండా నేరుగా ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని కోరారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, గ్రామ పంచాయతీల్లోని మల్టీపర్పస్ వర్కర్లతో కలిపి దాదాపు 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని ప్రభుత్వం చెబుతున్నదని.. ఆర్థిక భారం సాకుతో తొలగించిన వారందరినీ మానవతా దృక్పథంతో తిరిగి తీసుకోవాలన్నారు.
ఆర్థిక శాఖ నిర్వహించే ‘ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం’ పోర్టల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరి వివరాలను చేర్చాలని పేర్కొన్నారు. ఇంకా అనేక శాఖల వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ‘సమాన పనికి సమాన వేతనం’ ఇవ్వాలని కోరారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ, ఆయా శాఖల వారీగా పూర్తిస్థాయిలో బడ్జెట్ కేటాయించాలని వివరించారు.
