కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ దీక్షలో ఉన్న ఐదుగురు స్టూడెంట్లను స్కూల్ లోకి అనుమతించ లేదని పేర్కొంటూ హనుమాన్ దీక్షాపరులు, స్టూడెంట్స్, పేరెంట్స్ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి..
మెట్ పల్లి లోని నిఖిల్ భారత్ స్కూల్ లో చదువుతున్న ఐదుగురు స్టూడెంట్స్ హనుమాన్ దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకుంటే స్కూల్కు అనుమతించమని, 21 రోజుల పాటు స్కూల్కు రావద్దని యాజమాన్యం స్టూడెంట్స్తో లీవ్ లెటర్ రాయించుకుంది.
ఈ విషయాన్ని స్టూడెంట్స్ పేరెంట్స్కు తెలియజేయడంతో స్కూల్ ఎదుట స్టూడెంట్స్, పేరెంట్స్, దీక్షాపరులు బైఠాయించారు. స్కూల్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. హనుమాన్ దీక్ష తీసుకుంటే స్కూల్కు రావద్దని చెప్పడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూల్కు రానివ్వకుండా రూల్స్ పెట్టడం సరైంది కాదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై కిరణ్కుమార్ స్కూల్కు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి క్లాస్ రూంలోకి స్టూడెంట్స్ను అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.
