
- విచారణ జరిపి మూడు నెలల క్రితం పట్టాలు రద్దు చేసిన కలెక్టర్
- సహకరించిన అధికారులపై చర్యలకు ఆదేశించిన మంత్రి పొంగులేటి
- నెల రోజులు గడుస్తున్నా ముందుకు సాగని విచారణ
జగిత్యాల, వెలుగు: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారు లో సర్కార్, అసైన్డ్ భూముల్లో కొందరు లీడర్లు, వ్యాపారులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా పట్టాలు చేయించుకున్నారు. ఈ దందా పై గత ఏడాది నవంబర్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐదు నెలల పాటు సాగిన విచారణలో అక్రమంగా పాస్ బుక్ లు జారీ చేసినట్టు తేలింది. ఈ ఏడాది మార్చిలో పట్టాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఇద్దరు రైతులు స్వచ్ఛందంగా తమ పట్టాలను తిరిగి ప్రభుత్వానికి అందజేయగా మిగతావి రద్దయ్యాయి.
అయితే అక్రమ పట్టాలకు సహకరించిన అధికారులపై చర్యలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలకు పాల్పడిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు విచారణ ముందుకు సాగడం లేదు.
90 ఎకరాల అక్రమ పట్టాలు.. రూ. 60 లక్షల రైతు బంధు
నర్సింగాపూర్ శివారు లోని 437, 251 సర్వే నంబర్ల లో సుమారు 90 ఎకరాలకు పైగా అక్రమంగా ధరణి పట్టాలు సృష్టించారు. సర్వే నంబర్ 437లో 387.12 ఎకరాల్లో 71.11 ఎకరాలుకు, సర్వే నంబర్ 251 లో 207 ఎకరాల్లో 19.7 ఎకరాలకు అక్రమ పట్టాలు చేయించుకున్నట్లు విచారణలో బయట పడింది. ఫలితంగా సుమారు రూ. 60 లక్షల రైతు బంధు సహాయాన్ని అక్రమంగా పొందినట్లు అధికారులు
అంచనా వేశారు.
రెవెన్యూ ఆఫీసర్లదే కీలక పాత్ర
సర్కార్ భూములకు అక్రమ పట్టాలు ఇవ్వడం లో అప్పటి రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు వచ్చాయి. పట్టాల జారీకి 'నేచర్ ఆఫ్ ల్యాండ్' కాలమ్ లో అసైన్డ్ ల్యాండ్ను 'పట్టా ల్యాండ్'గా నమోదు చేసి, పాస్బుక్స్ జారీ చేశారు. పట్టా కోసం ఒక్కో ఎకరానికి రూ. 3 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. దాదాపు కోటి రూపాయల వరకు చేతులు మారాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ పట్టాలు పొందిన లబ్ధిదారులు, సహకరించిన అధికారుల పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.