
హైదరాబాద్, వెలుగు: బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ అభ్యర్థికే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం హామీ ఇచ్చారని, తరువాత అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవిని ఓసీ వ్యక్తికి ఇచ్చారని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాష్ర్టంలో 60 శాతం బీసీలే ఉన్నారని, త్వరలో ప్రకటించే అధ్యక్ష పదవిని బీసీ సామాజికవర్గం వారికి ఇవ్వాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే సీఎం పదవి కూడా బీసీకే ఇస్తామని ప్రకటించాలని జాజుల కోరారు. ‘‘రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం అగ్రకులాల నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే బీజేపీ అధికారానికి దూరం కావలసి వస్తుంది. హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారంలో రావడానికి అక్కడ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని వాగ్దానం చేశారు. అందుకే హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది” అని జాజుల తెలిపారు.