
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
బషీర్బాగ్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీజీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను విస్మరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు హామీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
సింగరేణి తరహాలోనే ఆర్టీసీ ఉద్యోగులకు లాభాల్లో వాటాను కేటాయించాలని చెప్పారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించకపోవడం విచారకరమన్నారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే బస్సుభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. త్వరలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు వెల్లడించారు. త్వరలో జరిగే ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రద్దు చేసి విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు.