24 గంటల్లో 31 డెలివరీలు.. జనగామ ఎంసీహెచ్​ రికార్డు

24 గంటల్లో 31 డెలివరీలు..  జనగామ ఎంసీహెచ్​ రికార్డు

జనగామ, వెలుగు:  జనగామ చంపక్​హిల్స్​లోని  మాతా శిశు హాస్పిటల్ మరో ఘనత సాధించింది. మంగళవారం ఒక్క రోజే 31 డెలివరీలు చేసి రికార్డు నెలకొల్పింది.  వీటిలో 17 నార్మల్​ కాగా 14 సిజేరియన్​ డెలివరీలు ఉన్నాయి.  జనగామ జిల్లాతో పాటు, పొరుగున ఉన్న యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్లోని సమీప మండలాలకు చెందిన పేషెంట్లు ఈ హాస్పిటల్​కు వస్తుంటారు. 

  నిత్యం రద్దీగా ఉండే ఇక్కడ గడిచిన 24 గంటలలో 31 డెలివరీలు చేసినట్లు హాస్పిటల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ సుగుణాకర్​ రాజు తెలిపారు. వీరిలో 12 మంది ఆడ శిశువులకు, 19 మంది మగ శిశువులకు జన్మనివ్వగా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు.

ALSO READ :ఖమ్మంలో కుండపోత .. పొంగిపొర్లుతున్న వాగులు

 ఇదిలా ఉంటే  జూన్ లో 314 డెలివరీలు కాగా వీటిలో 134 నార్మల్​, 180 సిజేరియన్​ ఉన్నాయి. ప్రస్తుత నెలలో ఇప్పటివరకు 308 డెలివరీలు కాగా వీటిలో 132 నార్మల్​, 176 సిజేరియన్​ ఉన్నాయి. హాస్పిటల్​లో అన్ని రకాల ఫెసిలిటీస్​ ఉండడంతో  డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా జనగామకు గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీ శాంక్షన్​ కావడంతో ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్లు డ్యూటీలో చేరారు.  రికార్డు డెలివరీలు చేసిన డాక్టర్లు స్రవంతి, సౌమ్యారెడ్డి, శ్రీ సూర్య, స్టాఫ్​ సంగీత, విజయారాణి, సెలెస్టీనాలను పేషెంట్ల బంధువులు, హాస్పిటల్​ సూపరింటెండెంట్​డాక్టర్​ సుగుణాకర్​ రాజు అభినందించారు.