
- జవహర్నగర్లో జరిగిన మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
- ఐదుగురు అరెస్ట్
జవహర్నగర్, వెలుగు: ఐదు రోజుల కిందట జవహర్నగర్లో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసును మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు ఛేదించారు. 10 ఎకరాల భూమి కోసం రియల్టర్ను చంపేందుకు సుపారీ ఇచ్చిన తండ్రీ కొడుకుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్కు చెందిన వేణు గోపాల్ (42) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. జవహర్నగర్లోని 10 ఎకరాల భూమి విషయంలో అదే ప్రాంతానికి చెందిన తండ్రీ కొడుకు లక్ష్మణ్, పవన్తో వేణు గోపాల్కు వివాదం నెలకొంది.
దీంతో అతడిని చంపేందుకు లక్ష్మణ్, పవన్ స్కెచ్ వేశారు. ఇందుకోసం తమకు తెలిసిన మరో ముగ్గురు వ్యక్తులు సురేశ్, జగదీశ్, సాయికిరణ్కు రూ.5 లక్షలు సుపారీ, ఓ ప్లాట్ ఇచ్చారు. ఈ నెల 9న రాత్రి 8 గంటలకు వేణుగోపాల్ చెన్నాపురం చెరువు ఏరియా మీదుగా బైక్ పై వెళ్తున్నాడు. లక్ష్మణ్, పవన్ అతడి గ్యాంగ్ సభ్యులు కారులో వేణు గోపాల్ను ఫాలో అయ్యారు. చెన్నాపురం చెరువు దాటగానే అతడి బైక్ను కారుతో ఢీకొట్టారు. ప్రమాదంలో వేణు గోపాల్ కిందపడిపోయాడు.
వెంటనే కారు దిగిన పవన్.. వేణుగోపాల్ గొంతు కోశాడు. కత్తులతో అతడిని నరికి చంపారు. ఆ తర్వాత ఐదుగురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు లక్ష్మణ్, పవన్, సురేశ్, జగదీశ్, సాయికిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 కత్తులు, కారు, 2 బైక్ లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీసీపీ గిరిధర్ తెలిపారు.