అమిత్ షా సమక్షంలో .. త్వరలో బీజేపీలోకి నటి జయసుధ

అమిత్ షా సమక్షంలో .. త్వరలో బీజేపీలోకి నటి జయసుధ
  • అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరిక

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ త్వరలో బీజేపీలో చేరనున్నారు. రెండ్రోజుల క్రితం ఆమెతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరేందుకు ఆమె అంగీకరించినట్లు సమాచారం. రాబోయే వారం పది రోజుల్లో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జయసుధ పార్టీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలో నిలిపేందుకు పార్టీ హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. 

2009 లో  జయసుధ కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా ఆమె అక్కడి నుంచి లేదంటే ముషీరాబాద్ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. జయసుధ పార్టీలో చేరనుండడంతో  ఎంపీ లక్ష్మణ్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయకు రాజకీయంగా ఇబ్బందులు తప్పేలా లేవు. ముషీరాబాద్ నుంచి ఈ ఇద్దరికి చెక్ పెట్టేందుకే ఆమెను పార్టీలోకి తీసుకువస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. 

ఈ నియోజకవర్గం నుంచి తన అనుచరులకు టికెట్ ఇప్పించుకోవాలని లక్ష్మణ్, ఇక్కడి నుంచే తన కూతురు విజయలక్ష్మిని పోటీలో దింపాలని దత్తాత్రేయ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జయసుధకు ముషీరాబాద్ టికెట్ ఇస్తే ఈ ఇద్దరు నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని పార్టీలో ప్రచారం సాగుతోంది.