రాయికల్, వెలుగు : రెండు రోజుల కింద కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో ఈదురుగాలులు, వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం రాయికల్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశలతో పంటలు సాగు చేసిన రైతులను ప్రకృతి దెబ్బతీసిందన్నారు.
అకాల వర్షంతో మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పంటల బీమా పథకం లేకపోవడంతో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. ఎకరాకు రూ.20వేలు పరిహారంగా ఇవ్వాలన్నారు. ఈనెలాఖరులోగా రైతు భరోసా సాయం విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం మోతె గ్రామంలోనూ దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, లీడర్లు రమేశ్, భూమారెడ్డి, మహిపాల్, గంగాధర్, నరేశ్, పాల్గొన్నారు.
