అడ్లూరి, శ్రీధర్ బాబే నన్ను బలిచ్చారు..! మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అడ్లూరి, శ్రీధర్ బాబే నన్ను బలిచ్చారు..! మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

=  నా మానసిక హింసకు వాళ్లిద్దరే కారణం

= వీళ్ల కారణంగా రోజూ క్షోభ అనుభవిస్తున్నా
= మొదటి  నుంచి ఉన్నోడిని పట్టించుకోరా
= పార్టీ ఫిరాయించినోడికి సభ్యత్వం లేదు..
= సంజయ్ కి పదేళ్లు దోచుకున్న అనుభవం ఉంది
=   మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన

హైదరాబాద్/జగిత్యాల: మంత్రులు అడ్లూరి లక్ష్మణ్​ కుమార్, శ్రీధర్ బాబు తన మానసిక క్షోభకు కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నన్ను మేకలా బలిచ్చారని వ్యాఖ్యానించారు. తనకు ఏ పదవులు అవసరం లేదని.. ఇకనుంచి కార్యకర్తలను కాపాడుకోవడమే తన పని అని అన్నారు. 

పార్టీ ఫిరాయించి వచ్చినోడికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తారా..? అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్‎లో ఉన్న వారిని పట్టించుకోరా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించినోడికి ఇప్పటికీ సభ్యత్వం లేదంటూ పరోక్షంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదు.. పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తున్నారని జీవన్ రెడ్డి  అన్నారు. 

మొదటి నుంచి ఉన్న వారిని పట్టించుకోరా..? ఆవేదన చెందారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తూ, మొదటి నుంచి ఉన్న వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై  మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు నేరుగా ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో  హాట్ టాపిక్‎గా మారింది. 

సంజయ్‎కి.. పదేళ్లు దోచుకున్న అనుభవం ఉందని ఆయన మాటలే వింటారా..?" అంటూ ఫైర్ అయ్యారు. తాము వలసదారులం కాదంటూ తాజాగా పార్టీలోకి చేరి పదవులనుభవిస్తున్న వారిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చురకలు అంటించారు. మంత్రి శ్రీధర్‌బాబు, అడ్లూరి అడ్డుకోకపోతే ఆ రోజే కథ వేరుండేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌‎లో మేం కౌలుదారులం కాదు.. పట్టాదారులమంటూ వ్యాఖ్యానించారు. 

ఇష్టం లేకుంటే వెళ్లగొట్టండి

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా కింద పోరాడుతున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పార్టీలో నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టి బీఆర్ఎస్ నాయకులకు బీర్పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీల్లో పదవులు ఇస్తున్నారని విమర్శించారు. పెంబట్ల దేవాలయం తప్ప, మిగతా అన్ని కమిటీలు బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ కమిటీలో సైతం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులకు స్థానం కల్పించారని ఆరోపించారు. వలసదారులకు ప్రాధాన్యత ఇస్తూ పోతే ఇక పార్టీలో తాము ఉండి ఎందుకని ప్రశ్నించారు. మీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని బయటకు వెళ్లగొట్టండని అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో వలసదారుల ముందు తలవంచనని అన్నారు. 

రాత్రులు నిద్రపట్టడం లేదు

ఒక్కోసారి రాత్రులు నిద్ర కూడా పట్టని పరిస్థితి నెలకొందని జీవన్ రెడ్డి అన్నారు. తమను కొద్దికొద్దిగా చంపకండని అన్నారు. ఒకేసారి నరికేసే నిర్ణయమైనా తీసుకోండని ఆవేదనతో అన్నారు. వలసదారుల్లా దోచుకునే వారిమి కాదని పదవులు ఉన్న లేకపోయినా పార్టీ కోసం ప్రజల కోసం పని చేసే తత్వం తన కార్యకర్తలదని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. జీవన్‌రెడ్డి ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు.