విమానం ఎక్కుతుండగా మెట్లపై జారి పడ్డ బైడెన్

విమానం ఎక్కుతుండగా మెట్లపై జారి పడ్డ బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే క్రమంలో మెట్లపై జారి పడ్డారు. ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్ ఫోర్స్ వన్ లోకి ఎక్కుతుండగా బైడెన్ కాలు స్లిప్ అయ్యింది. అంతలోనే లేచి ఆయన విమానం లోపలికి వెళ్లారు. జో బైడెన్ విమానం మెట్లపై కాలు జారి పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అయితే.. బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్‭లో ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి పడటం ఇది మూడోసారి. అంతకుముందు 2021లో జార్జియా నుంచి బయలుదేరిన సమయంలో కాలు జారి పడిపోయారు. ఆ తర్వాత 2022లో ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‭లో ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు ఎక్కుతున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోయారు. అలాగే.. అమెరికా సమ్మిట్‭కు హాజరయ్యేందుకు లాస్ ఏంజిల్స్‭కు వెళ్లే ముందు అడుగులు వేస్తున్నప్పుడు జో బైడెన్ తడబడ్డారు. ఇక ఉక్రెయిన్ పర్యటనలో అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశమైన బైడెన్ కైవ్‭కు మద్దతు తెలిపారు.