
- ‘మిషన్ 26 డేస్’ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్
- రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ
- మొదటివారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం
- రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం
- మూడో తేదీన షురూ కానున్న రెవెన్యూ సదస్సులు
- గ్రామాలకు కొత్త జీపీవోలు.. ఉద్యోగుల డిమాండ్లపైనా ప్రకటన
- ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు.. ఎమ్మెల్యేలూ ఫీల్డ్లోనే ఉండాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. దీంతోపాటు ఇప్పటికే మొదలైన స్కీములను స్పీడప్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘‘మిషన్ 26 డేస్’’ పేరుతో పలు కొత్త పథకాలు, కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తున్నది. లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ యువ వికాసం, గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నది. దీంతో పాటు రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకూ నిర్ణయం తీసుకుంది. 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూసమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతున్నది.
అందులో భాగంగా రెవెన్యూ ఆఫీసర్ల సెలవులను రద్దు చేసింది. గ్రామాలకు కొత్త జీపీవోలను నియమించడంతో పాటు ఉద్యోగుల డిమాండ్లపైనా ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. రాష్ట్ర అవతరణ వేడుకలు, కొత్త పథకాల ప్రారంభం నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పథకాల అమలును పర్యవేక్షించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించింది. -
యువ వికాసం.. ఇందిరమ్మ ఇండ్లపై ఫోకస్
రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రతిష్టాత్మక రాజీవ్ యువ వికాసం స్కీంను సర్కారు ప్రారంభించనుంది. యువత సాధికారత, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం స్కీంకు రూపకల్పన చేశారు. నాలుగు నెలల్లో 5 లక్షల మందికి ఈ పథకం అందజేయనున్నారు. దశల వారీగా అమలు చేయనున్న ఈ పథకంలో తొలుత రూ. లక్షలోపు వారికి సబ్సిడీ అందజేయనున్నారు. ప్రతినెలా రూ.1500 కోట్ల చొప్పున రూ.6 వేల కోట్ల సబ్సిడీని అక్టోబర్ 2 నాటికి లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద పూర్తిచేసిన ఇండ్లకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జరుగుతున్న పనులను బట్టి ప్రభుత్వం కూడా ఇందిరమ్మ లబ్ధిదారులకు విడతల వారీగా నిధులు రిలీజ్ చేస్తూ వస్తోంది. వారిలో కొందరు జూన్ మొదటి వారంలోనే గృహ ప్రవేశం చేయనున్నారు.
రైతు భరోసా నిధుల చెల్లింపు
వానాకాలం పంట సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా పథకం కింద పెండింగ్లో ఉన్న నిధులను జూన్లోనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మేలోనే పూర్తిగా చెల్లించాలని అనుకున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదని చెప్తున్నారు. దీంతో జూన్ మొదటి వారంలోనే పెట్టుబడి సాయం ప్రారంభించాలని ఇప్పటికే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కొత్త జీపీవోలు, ఉద్యోగుల డిమాండ్లపై ప్రకటన
గ్రామ స్థాయిలో పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆఫీసర్ (జీపీవో) పోస్టులను భర్తీ చేస్తోంది. దాదాపు 3,500 మందిని జూన్ 2న రెవెన్యూ శాఖలోకి తీసుకుంటూ రీఅపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లపైనా ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. ఇందు కోసం ఇప్పటికే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వనుంది.
మరోవైపు భూ సమస్యల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన లక్ష్యంగా ప్రభుత్వం జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులను ప్రారంభించనుంది. ఇప్పటికే పైలెట్మండలాల్లో నిర్వహిస్తున్న సదస్సులకు మంచి స్పందన వస్తోంది. కోర్టు వివాదాల్లో ఉన్న సాదా బైనామాలకు తప్ప మిగిలిన సమస్యల పరిష్కారానికి యంత్రాంగం సిద్ధమవుతోంది. వేల సంఖ్యలో అప్లికేషన్లు రావడంతో వాటి పరిష్కారానికి ఎక్కువ టైమ్ పట్టే చాన్స్ ఉన్నప్పటికీ పరిష్కారమైతే రైతులకు రిలీఫ్ దొరకనుంది.