జూన్ 25 రాష్ట్రానికి నడ్డా.. టూర్​ షెడ్యూల్ ఖరారు చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ

జూన్ 25 రాష్ట్రానికి నడ్డా.. టూర్​ షెడ్యూల్ ఖరారు చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ
  • టూర్​ షెడ్యూల్ ఖరారు చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ 
  • నోవాటెల్​లో మధ్యాహ్నం పార్టీ ముఖ్యులతో సమావేశం
  • సాయంత్రం నాగర్ కర్నూల్ సభకు.. తర్వాత తిరువనంతపురం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. ఆయన నాగర్ కర్నూల్​లో పర్యటించనున్నారు. ఈ టూర్ షెడ్యూల్ వివరాలను పార్టీ రాష్ట్ర శాఖ శుక్రవారం హైకమాండ్​కు పంపించింది. దీంట్లో ఏమైనా స్వల్ప మార్పులు మినహా దాదాపుగా ఇదే టూర్ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ నెల 25న మధ్యాహ్నం 12.45 గంటలకు నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 వరకు ‘‘సంపర్క్ సే అభియాన్’’ ప్రోగ్రామ్ లో భాగంగా సమాజంలో ఇతర రంగాలకు చెందిన ఇద్దరు ప్రముఖులను హోటల్ నోవాటెల్ లో నడ్డా కలవనున్నారు. వారికి మోదీ తొమ్మిదేండ్ల పాలనపై ముద్రించిన పుస్తకాన్ని అందించి, పాలన తీరును వివరించనున్నారు.

సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు నాగర్ కర్నూల్ లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి.. సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకోనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.10 గంటలకు నాగర్ కర్నూల్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి.. సాయంత్రం 6.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 7.40 గంటలకు ప్రత్యేక విమానంలో తిరువనంతపురం బయలుదేరుతారు.