హైదరాబాద్ లో పీక్ టైంలో రోడ్లపై ప్రయాణించాలంటే చుక్కలు కనపడతాయి. అదే వీకెండ్ అయితే ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండవు. కిలో మీటరు దూరం ప్రయాణించాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సిదే. గచ్చిబౌలి–మియాపూర్ కారిడార్ ఏరియాలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ పరిధిలోని ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏరియాలో అండర్ పాస్.. స్కైవాక్ నిర్మిచాలని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
వీకెండ్.. హాలిడేస్ రోజుల్లో ఈ ఏరియాకు లక్షల మంది వస్తుంటారు. ఆరు లైన్ల రోడ్ ఉన్న కొండాపూర్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ఏరియాలో షాపులకు వచ్చే వాహనాల పార్కింగ్ చేయడం వలన రెండు లైన్లకే పరిమితమవుతుంది. బస్లు.. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులు ఎక్కి.. దిగేందుకు తగినంత స్పేస్ లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. వంద మీటర్లు ప్రయాణించాలంటే రెండు గంటల సమయం పడుతుందని వాహనదారులు వాపోతున్నారు.
ట్రాఫిక్ సమస్యపరిష్కారం కావాలంటే శరత్ సిటీ క్యాపిటల్ మాల్ క్లోజ్ చేయాలని సైబరాబాద్ అధికారులు మాల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఈ ఏరియాలో లక్షలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. గతేడాది మాల్ పార్కింగ్ ప్రాంతాన్ని ప్రధాన రహదారితో కలుపుతూ 22 అడుగుల వెడల్పు గల అండర్పాస్ను నిర్మించారు. అయినప్పటికీ మాల్ గేట్ నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు.. అక్కడి నుండి రాడిసన్ హోటల్ వరకు ట్రాఫిక్ కు నిరంతరం అంతరాయం కలుగుతుంది.
షాపింగ్ మాల్ఎంట్రన్స్ దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉండటంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. రద్దీ సమయాల్లో మాల్ బయట ఉన్న మార్గాన్ని దాటడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.
శరత్ సిటీ క్యాపిటల్ మాల్ దగ్గర ట్రాఫిక్ పరిస్థితిని గమనించిన అధికారులు..పరిష్కారం కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు కొన్ని రోజులుగా పలు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. గతేడాది నిర్మించిన అండర్పాస్ ఈ ప్రాంతంలో రద్దీని తగ్గించిందని, కానీ మాల్ వెలుపల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని అధికారులు తెలిపారు.
