
జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల స్వీకరణను టీఎస్పీఎస్పీ వాయిదా వేసింది. ఈ నెల 20 నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని ప్రకటించింది. 1392 జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ తొలుత ఇవాళ్టి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే సాంకేతిక లోపం తలెత్తడంతో దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది. ఈ నెల 20 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
జూనియర్ లెక్చరర్ పోస్టుల అప్లికేషన్స్ గడువు జనవరి 6 వరకు ఉండగా.. దాన్ని 10 వరకు పెంచారు. జూన్, జులైలో జేఎల్ పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో జేఎల్ నోటిఫికేషన్ జారీ చేశారు. అనేక అవాంతరాల తర్వాత ఈ పోస్టులను 2012లో భర్తీ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సుమారు 457 జేఎల్ పోస్టులను అప్పట్లో భర్తీ చేయగలిగారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్ పోస్టుల భర్తీ జరగలేదు. ఈ నేపథ్యంలో జేఎల్ పోస్టుల కోసం ఈసారి అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడే అవకాశం ఉంది.