ప్రగతిభవన్​ కాదు..బానిసల భవన్ : జూపల్లి

ప్రగతిభవన్​ కాదు..బానిసల భవన్ : జూపల్లి
  •  అహంకారంలో కేసీఆర్​ను మించినోళ్లు లేరు: జూపల్లి కృష్ణారావు

 హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​ నోరు తెరిస్తే అబద్ధాలేనని, అహంకారంలో ఆయనను మించినోళ్లు ఎవరుంటారని కాంగ్రెస్​ నేత జూపల్లి కృష్ణా రావు అన్నారు. తనను అహంకారి అన్న కేసీఆర్​ కామెంట్లను జూపల్లి కొట్టిపారేశారు. తనది అహంకారం కాదని, ఆత్మగౌరవమని పేర్కొన్నారు. కేసీఆర్​ చెప్పినట్టు వినలేదు కాబట్టే తనను అహంకారి అని కేసీఆర్​ అంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో కేసీఆర్​కు ఎప్పటి నుంచో లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. తనవైపు వేలు చూపించే హక్కు కూడా కేసీఆర్​కు లేదన్నారు. కమ్యూనిస్టులను తోక పార్టీలు అన్న కేసీఆర్​ది అహంకారం కాదా అని ప్రశ్నించారు. ప్రగతిభవన్​లో కనీసం మంత్రులకూ అనుమతివ్వని కేసీఆర్​దే అహంకారమన్నారు. అది ప్రగతి భవన్​ కాదని, బానిసల భవన్​ అని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్​లో అలాంటి పరిస్థితి ఉండదన్నారు. సోనియా గాంధీని రాష్ట్రస్థాయి నేతలెవరైనా ఎప్పుడైనా కలిసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేసీఆర్​ మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కేసీఆర్​ కూడా ఓసారి ఎన్నికల్లో ఓడిపోలేదా అని ప్రశ్నించారు. ఆయన కూతురు కవిత, వినోద్​ కుమార్​కూ భంగపాటు తప్పలేదని గుర్తు చేశారు. ధర్నా చౌక్​ ఎత్తేసిన ఘనత కేసీఆర్​దేనని అన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవాలంటూ కేసీఆర్​ తనకు చెప్పారని, అందుకు తాను నో చెప్పినందుకే తనపై అహంకారి అనే ముద్ర వేస్తున్నారని విమర్శించారు.