
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై అలర్ట్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘జనతా కర్ఫ్యూ’ పాటించమన్నారు. అంటే, ఎవరికి వారే స్వచ్ఛందంగా మార్చి 22వ తేదీ ఆదివారంనాడు తమ తమ ఇళ్లకే పరిమితం కావాలి. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటలపాటు బయట ఎక్కడా తిరగొద్దు అన్నది ఈ ‘జనతా కర్ఫ్యూ’ ఉద్దేశం.
మోడీ ‘జనతా కర్ఫ్యూ’ కాల్ వినగానే ఒకప్పటి ఘటనను గుర్తు చేసుకోవాలి. 1965 ఇండియా-–పాకిస్తాన్ యుద్ధ సమయం. యుద్ధం కారణంగా దేశంలో తిండి గింజల కొరత వచ్చే ప్రమాదాన్ని ఊహించారు అప్పటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. పాకిస్థాన్తో యుద్ధం వల్ల ఎదురయ్యే ఇబ్బందులన్నీ దేశ ప్రజలకు వివరించారు. యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం దెబ్బ తింటుంది. దిగుబడి తగ్గితే తిండి గింజలకు జనం అల్లాడిపోతారు. రేషన్ పద్ధతిలో తిండి గింజల్ని సర్దుబాటు చేసుకోవాలి. ఈ పరిస్థితిని ఫేస్ చేయడానికి లాల్ బహదూర్ ఒక అప్పీల్ చేశారు. ‘ప్రజలంతా వారానికి ఓ పూట ఉపవాసం ఉండాలి. ఒక పూట తిండి మానేస్తే ఆ మేరకు తిండి గింజలు మిగులుతాయి. వాటిని అవసరమైనవారికి పంచడానికి వీలవుతుంది’ అని శాస్త్రి పిలుపు ఇచ్చారు.
తన ఉద్దేశాన్ని జనాలకు తెలియజేయడానికి ముందు… మొట్టమొదట తన ఇంటి నుంచే మొదలుపెట్టారు లాల్ బహదూర్ శాస్త్రి. తన కుటుంబంతో ఒక రోజు ఉపవాసం చేయించారు. ఆ తర్వాతనే ప్రజలకు అప్పీల్ చేశారు. దీనికి దేశమంతా సానుకూలంగా స్పందించింది. జనం ఈ పిలుపును ‘శాస్త్రి వ్రతం’గా ఆచరించారు. ఆఖరికి రెస్టారెంట్లు, హొటళ్లు సైతం మూతబడ్డాయి. ప్రతి సోమవారం రాత్రి జనం స్వచ్ఛందంగా ఉపవాసం పాటించారు.
రేడియోలో ప్రధాన మంత్రి శాస్త్రి ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆదేశంగా తీసుకున్నారు, కుటుంబాలు ప్రతి సోమవారం రాత్రి ఉపవాసం ఉండేవారు. ఇండో–పాక్ యుద్ధ సమయంలో ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాలు ప్రజలకు తారక మంత్రాలయ్యాయి. ఇప్పుడు కరోనా వైరస్ కంట్రోల్ చేయడానికి మోడీ ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో… లాల్ బహదూర్ శాస్త్రి ఆనాడు ఇచ్చిన పిలుపును ఒకసారి యాది చేసుకోవాలి. ప్రజా సంక్షేమం కోసం ప్రధానులు ఇచ్చే సందేశాలు అంత బలంగా ఉంటాయి.