దళితులు ఓటు బ్యాంకు కాదు... సీఎం రేవంత్​ తో కేఏ పాల్ ​భేటీ

దళితులు ఓటు బ్యాంకు కాదు... సీఎం రేవంత్​ తో కేఏ పాల్ ​భేటీ

ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పుష్పగుచ్ఛాలను ఇచ్చి క్రిస్మస్ విషెస్ తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేఏ పాల్ ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారి. మర్యాదపూరకంగానే కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారి మధ్య ఎలాంటి రాజకీయాల ప్రస్తావన రాలేదని చెబుతున్నారు. జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించినట్లు కేఏ పాల్ తెలిపారు. గ్లోబల్ పీస్ సదస్సుకు కావాల్సిన అనుమతులను సైతం మంజూరు చేయాల్సిందిగా కేఏ పాల్ కోరారు.

రాష్ట్రంలో నివసించే క్రైస్తవ సామాజిక వర్గాల వారు ఎదుర్కొంటోన్న కొన్ని అంశాలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.  జనాభా నిష్పత్తి ప్రాదిపదికన క్రైస్తవులకు రాజకీయ ప్రాతినిథ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని కేఏ పాల్ సూచించినట్లు చెబుతున్నారు. దీని ఆధారంగా వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. దళితులను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరినట్లు సమాచారం.

దళిత బంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, మరింత మందిని లబ్దిదారులుగా చేర్చాలని కోరినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా దళిత బంధు పథకాన్ని అమలు చేయడంతో పాటు క్రైస్తవుల సంక్షేమంపై దృష్టిం సారించాలని కోరినట్లు చెబుతున్నారు.

దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంటూ వస్తోన్న కొన్ని డిమాండ్లను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా.. దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులను సవరించాల్సిన అవసరం ఉందని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు.