
- థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయించడంపై ఆలోచనలు
- సహకరిస్తామని సీడబ్ల్యూసీ హామీ
- టీవోఆర్ చేసుకుందామని వెల్లడి
- ఒకట్రెండు రోజుల్లో సీడీవోతో కీలక సమావేశం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)తో సంప్రదింపులు జరుపుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు రిపేర్లు చేయించాలని నిర్ణయించారు. అయితే, బ్యారేజీలకు రీహాబిలిటేషన్ డిజైన్లను తయారు చేసి.. అందుకు అనుగుణంగానే రిపేర్లు చేయించాలని ఎన్డీఎస్ఏ సూచించిన నేపథ్యంలో డిజైన్లపై అధికారులు దృష్టి సారించారు.
వాస్తవానికి డిజైన్ల విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)వింగ్.. బ్యారేజీలకు రీహాబిలిటేషన్ డిజైన్లు ఇవ్వడంలో చేతులెత్తేసింది. దీంతో సీడబ్ల్యూసీతోనే డిజైన్లు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా సీడబ్ల్యూసీ కూడా అందుకు విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.
అవసరమైతే డిజైన్లకు సహకరిస్తాంగానీ.. నేరుగా తాము ఇన్వాల్వ్ కాలేమని అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. సీడీవో నుంచో లేదంటే ఇతర ఏజెన్సీల ద్వారానో డిజైన్లను తయారు చేయిస్తే వాటిని పరిశీలిస్తామని, సాంకేతిక సహకారం అందిస్తామని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పినట్టు తెలిసింది. ఆ సహకారం అందించేందుకు ప్రభుత్వంతో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ఒప్పందం) చేసుకునేందుకు సిద్ధమని తెలిపినట్టు సమాచారం.
ఒకట్రెండు రోజుల్లో సీడీవోతో మీటింగ్..
ప్రాజెక్ట్ బ్యారేజీలు ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం డిజైన్లలో లోపాలేనని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నతాధికారులు డిజైన్ల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. భవిష్యత్లో మరిన్ని సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా డిజైన్లను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దేశంలో పేరున్న లేదా అంతర్జాతీయ సంస్థలతో డిజైన్లు తయారు చేయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒకట్రెండు రోజుల్లో ఈ రీహాబిలిటేషన్ డిజైన్లపై సీడీవో, సీడబ్ల్యూసీతో కీలక సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలిసింది.
సీడీవోతోనే డిజైన్లు చేయించాలా? లేదంటే ఇతర ఏజెన్సీలకు అప్పగించాలా? అన్నదానిపై ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే డిజైన్లకు సంబంధించి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మించిన బావర్ సంస్థతో చేయించాలని నిర్ణయించినా ఆ సంస్థ చేయలేమని చెప్పింది. ఇటు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కూడా కేవలం జియోటెక్నికల్, జియోఫిజికల్ టెస్టుల వరకే పరిమితమవుతామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే డిజైన్లను ఎవరికిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఏడో బ్లాక్ కూల్చేస్తరా? రిపేర్లు చేస్తరా?
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగిపోయినందునదాన్ని కూల్చి కొత్తది కట్టాలని ఎన్డీఎస్ఏ ఇప్పటికే సూచించింది. లేదంటే రిపేర్లతో బ్యారేజీకి ప్రమాదం లేదనుకుంటే రిపేర్లు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే దీనిపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఏడో బ్లాక్కు జరిగిన నష్టం, భారీ గొయ్యి నేపథ్యంలో దానిని కూల్చి కడితేనే మేలని పలువురు నిపుణులు చెబుతున్నట్టు తెలిసింది.
రిపేర్లు చేసి నిలబెట్టినా.. ఫలితం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు చెబుతున్నారు. రిపేర్లు చేసినా గేట్ల ఆపరేషన్ సరిగ్గా ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైనా ఏదో ఒకటి తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.