మేడిగడ్డ రీహాబిలిటేషన్ డిజైన్లు ఎవరితో చేయిద్దాం?..చేతులెత్తేసిన సీడీవో.. వెనకడుగేసిన సీడబ్ల్యూసీ

మేడిగడ్డ రీహాబిలిటేషన్ డిజైన్లు  ఎవరితో చేయిద్దాం?..చేతులెత్తేసిన సీడీవో.. వెనకడుగేసిన సీడబ్ల్యూసీ
  • థర్డ్​ పార్టీ ఏజెన్సీతో చేయించడంపై ఆలోచనలు
  • సహకరిస్తామని సీడబ్ల్యూసీ హామీ
  • టీవోఆర్​ చేసుకుందామని వెల్లడి
  •  ఒకట్రెండు రోజుల్లో సీడీవోతో కీలక సమావేశం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)తో సంప్రదింపులు జరుపుతున్నారు. నేషనల్ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) సూచనల మేరకు రిపేర్లు చేయించాలని నిర్ణయించారు. అయితే, బ్యారేజీలకు రీహాబిలిటేషన్ డిజైన్లను తయారు చేసి.. అందుకు అనుగుణంగానే రిపేర్లు చేయించాలని ఎన్​డీఎస్​ఏ సూచించిన నేపథ్యంలో డిజైన్లపై అధికారులు దృష్టి సారించారు. 

వాస్తవానికి డిజైన్ల విషయంలో ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​లోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్​ (సీడీవో)వింగ్​.. బ్యారేజీలకు రీహాబిలిటేషన్ డిజైన్లు ఇవ్వడంలో చేతులెత్తేసింది. దీంతో సీడబ్ల్యూసీతోనే డిజైన్లు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా సీడబ్ల్యూసీ కూడా అందుకు విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

అవసరమైతే డిజైన్లకు సహకరిస్తాంగానీ.. నేరుగా తాము ఇన్వాల్వ్​ కాలేమని అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. సీడీవో నుంచో లేదంటే ఇతర ఏజెన్సీల ద్వారానో డిజైన్లను తయారు చేయిస్తే వాటిని పరిశీలిస్తామని, సాంకేతిక సహకారం అందిస్తామని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పినట్టు తెలిసింది. ఆ సహకారం అందించేందుకు ప్రభుత్వంతో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్​ (ఒప్పందం) చేసుకునేందుకు సిద్ధమని తెలిపినట్టు సమాచారం. 

ఒకట్రెండు రోజుల్లో సీడీవోతో మీటింగ్..

ప్రాజెక్ట్ బ్యారేజీలు ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం డిజైన్లలో లోపాలేనని ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నతాధికారులు డిజైన్ల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. భవిష్యత్​లో మరిన్ని సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా డిజైన్లను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దేశంలో పేరున్న లేదా అంతర్జాతీయ సంస్థలతో డిజైన్లు తయారు చేయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒకట్రెండు రోజుల్లో ఈ రీహాబిలిటేషన్ డిజైన్లపై సీడీవో, సీడబ్ల్యూసీతో కీలక సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలిసింది. 

సీడీవోతోనే డిజైన్లు చేయించాలా? లేదంటే ఇతర ఏజెన్సీలకు అప్పగించాలా? అన్నదానిపై ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే డిజైన్లకు సంబంధించి పోలవరం డయాఫ్రమ్​ వాల్​ నిర్మించిన బావర్ సంస్థతో చేయించాలని నిర్ణయించినా ఆ సంస్థ చేయలేమని చెప్పింది. ఇటు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కూడా కేవలం జియోటెక్నికల్, జియోఫిజికల్ టెస్టుల వరకే పరిమితమవుతామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే డిజైన్లను ఎవరికిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

ఏడో బ్లాక్​ కూల్చేస్తరా? రిపేర్లు చేస్తరా?

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్​ కుంగిపోయినందునదాన్ని కూల్చి కొత్తది కట్టాలని ఎన్​డీఎస్​ఏ ఇప్పటికే సూచించింది. లేదంటే రిపేర్లతో బ్యారేజీకి ప్రమాదం లేదనుకుంటే రిపేర్లు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే దీనిపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఏడో బ్లాక్​కు జరిగిన నష్టం, భారీ గొయ్యి నేపథ్యంలో దానిని కూల్చి కడితేనే మేలని పలువురు నిపుణులు చెబుతున్నట్టు తెలిసింది.

 రిపేర్లు చేసి నిలబెట్టినా.. ఫలితం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు చెబుతున్నారు. రిపేర్లు చేసినా గేట్ల ఆపరేషన్​ సరిగ్గా ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైనా ఏదో ఒకటి తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.