
సొంతపార్టీపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని..పార్టీకి, పార్టీ అధినేత అయిన తండ్రికి తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు..పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత.
బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. తాను జైలు ఉన్నప్పుడే కుట్ర మొదలైందని, ఇంటి బిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించారని అన్నారు. నామీద పడి ఏడిస్తే ఏమొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను జైలుకెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినట్లు లీకువీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారని..నా జోలికి వస్తే బాగుండదని ఎమ్మెల్సీ కవిత బీఆర్ ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని కొందరు చెప్పుకుంటున్నారు.. కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు అని కొందరు పార్టీనేతలనుద్దేశించి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదని అన్నారు. పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారు..నా లేఖ లీక్ చేసిందెవరో చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.
ALSO READ | కవిత చెప్పింది నిజం.. దెయ్యాలను పెంచి పోషించింది కేసీఆరే: మంత్రి జూపల్లి
కేసీఆర్ కు నోటీసుల విషయంలో మాట్లాడిన కవిత..పార్టీ అధినేతకు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదని విమర్శించారు. ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారని ప్రశ్నించారు. తాను చిచోరా రాజకీయాలు చేయనని.. హుందాగా నడుచుకునే వ్యక్తినని పార్టీ చేయాల్సిన పనులనను జాగృతి తరపున చేస్తున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కనపెట్టడం లేదని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు..పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత.
మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ.. కాంగ్రెస్ తో రాయబారాలు చేసే అవసరం నాకు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ కు, తనకు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని తెలిపారు. తనను పార్టీకి దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసని.. కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని బాంబు పెల్చారు ఎమ్మెల్సీ కవిత.