- ప్రొఫెసర్కనకయ్యకు వీసీ అపాయింట్మెంట్ లెటర్
- వెంటనే బాధ్యతల స్వీకరణ
- వర్సిటీలో ఆసక్తికర పరిణామం
డిచ్పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ నియామకం పిల్లలు ఆడుకునే కుర్చీలాటను తలపిస్తోంది. తాజాగా యూనివర్సిటీ కొత్త రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ కనకయ్యను నియమిస్తూ వీసీ రవీందర్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొదట వీసీ రవీందర్ గుప్తా రిజిస్ట్రార్గా విద్యావర్ధినిని నియమించారు. యూనివర్సిటీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకుంది. దీంతో యాదగిరిని రిజిస్ట్రార్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం..ఇది ఒప్పుకోని వీసీ రవీందర్ మళ్లీ ఓయూ ప్రొఫెసర్ నిర్మలా దేవిని నియమించడం చకచకా జరిగిపోయాయి.
అయితే, ఉన్నత విద్యామండలి ఒత్తిడితో నిర్మలా దేవి తిరిగి ఓయూలో రిపోర్ట్ చేయగా, తిరిగి యాదగిరినే ఈసీ రిజిస్ట్రార్గా నియమించింది. పట్టు వదలని వీసీ వర్సిటీలోని రిజిస్ట్రార్ చాంబర్కు తాళాలు తీయొద్దని ఆదేశించడంతో రిజిస్ట్రార్ యాదగిరి వేరే చాంబర్లో కూర్చోవాల్సి వచ్చింది. ఆ టైంలోనే మాట్లాడిన వీసీ రవీందర్ గుప్తా రిజిస్ట్రార్ను నియమించే అధికారం తనకే ఉందని, త్వరలోనే కొత్త రిజిస్ట్రార్ పేరు ప్రకటిస్తానన్నారు. ఆయన అన్నట్టుగానే శుక్రవారం ప్రొఫెసర్ కనకయ్యను రిజిస్ట్రార్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అపాయింట్మెంట్ లెటర్ కూడా అందజేశారు. వెంటనే కనకయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఈసీ ఎలా స్పందిస్తుందోనని, ఉన్నత విద్యా మండలి ఏం స్టెప్ తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈసీ తిరస్కరిస్తే వీసీ మళ్లీ ఏం చేస్తారోనని చర్చించుకుంటున్నారు.

