పవర్‌‌ఫుల్ పాత్రలో ఫైర్ బ్రాండ్ కంగన

పవర్‌‌ఫుల్ పాత్రలో ఫైర్ బ్రాండ్ కంగన

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌‌ నటనను ఇష్టపడే వారికి గుడ్‌‌ న్యూస్. తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌‌లో నటిస్తున్న కంగన.. మరో రాజకీయ నేత పాత్రలో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రోల్‌‌లో మెస్మరైజ్ చేయడానికి కంగన రెడీ అవుతోంది. సాయి కబీర్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో స్వాతంత్ర్యానంతరం భారత రాజకీయాలపై ఫోకస్ చేయనున్నారని సమాచారం. ఈ విషయంపై ఫైర్ బ్రాండ్ కంగన స్పందించింది. ఈ మూవీ బయోపిక్ కాదని, కానీ ఎమర్జెన్సీ రోజులతోపాటు ఆపరేషన్ బ్లూస్టార్ ఘటనలు సినిమాలో కీలకమని స్పష్టం చేసింది.

‘అవును, ఈ ప్రాజెక్ట్ పై మేం పని చేస్తున్నాం. స్ట్రిప్ట్ చివరి దశలో ఉంది. ఇది ఇందిరా గాంధీ బయోపిక్ కాదు. ఇదో గ్రాండ్ పీరియడ్ ఫిల్మ్. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ వాతావరణం గురించి తెలుసుకోవడానికి ఈతరానికి ఈ మూవీ దోహదపడుతుంది. దేశ రాజకీయాల్లో ఇందిరా గాంధీ ఓ ఐకానిక్ లీడర్’ అని కంగన పేర్కొంది. ఈ ఫిల్మ్‌‌లో టాప్ నటులు భాగం కానున్నారని మూవీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి పాత్రల్లో పేరున్న నటీనటులు యాక్ట్ చేయనున్నారని సమాచారం. పెద్ద ఎత్తున తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.