Dileep Raj: అకస్మాత్తుగా మరణించిన టాలెంటెడ్ యాక్టర్.. రిషబ్ శెట్టి ఎమోషనల్ ట్వీట్

Dileep Raj: అకస్మాత్తుగా మరణించిన టాలెంటెడ్ యాక్టర్.. రిషబ్ శెట్టి ఎమోషనల్ ట్వీట్

కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం మే13, 2026న తెల్లవారుజామున ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. నటుడు దిలీప్ రాజ్‌ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.

కేవలం 47 ఏళ్ల వయసులోనే దిలీప్ గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోవడం ఆయన కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఓ టాలెంటెడ్ నటుడ్ని కోల్పోవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

 రిషబ్ శెట్టి ఎమోషనల్ ట్వీట్..

దిలీప్ రాజ్ మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంతారా హీరో రిషబ్ శెట్టి స్పందిస్తూ.. “ఒక మంచి నటుడు, దర్శకుడు, నిర్మాత.. అన్నింటికంటే ముఖ్యంగా గొప్ప మానవతావాది. మనం కొన్ని సందర్భాల్లో మాత్రమే కలిసినా, మీ వ్యక్తిత్వంతో మనసుల్లో చెరగని ముద్ర వేసావు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ భావోద్వేగ నివాళులు అర్పించారు. 

దిలీప్ రాజ్ సినిమాలు:

పునీత్ రాజ్‌కుమార్ నటించిన మిలనా సినిమాతో దిలీప్ రాజ్ మంచి గుర్తింపు పొందారు. అనంతరం పలు సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా సమంత నటించిన ' యూ టర్న్' మూవీలో కీలక పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్ ని కూడా మెప్పించారు.

దిలీప్ రాజ్ చివరిసారిగా నటించిన చిత్రం 'నిమ్మ వాస్తుగలిగే నీవే జవాబ్దారారు'. ఈ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ఓ సీరియస్ బిజినెస్‌మ్యాన్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటుడిగానే కాకుండా నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఆయన సేవలందించారు.

దిలీప్ రాజ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉండేవారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకునేవారు. ఆయనకు 29 వేలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.