భార్య, బిడ్డలను సుత్తితో కొట్టి చంపిన డాక్టర్

 భార్య, బిడ్డలను సుత్తితో కొట్టి చంపిన డాక్టర్

కాన్పూర్: ‘‘డెడ్ బాడీలను లెక్కపెట్టి నేను విసిగిపోయాను. ఒమిక్రాన్ ఎవరినీ వదిలిపెట్టదు. అందుకే నా భార్య, బిడ్డలకు ఆ బాధ నుంచి విముక్తి కల్పిస్తున్నా..” అంటూ ఓ డాక్టర్ తన భార్య, ఇద్దరు బిడ్డలను సుత్తితో కొట్టి చంపేశాడు. తనకు నయం కాని జబ్బు కూడా ఉందంటూ నోట్ రాసి పారిపోయాడు. యూపీలోని కాన్పూర్ సిటీ ఇందిరా నగర్ లో శుక్రవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. సిటీలోని రమా మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం చీఫ్​గా పని చేస్తున్న డాక్టర్ సుశీల్ కుమార్ ఈ ఘోరానికి పాల్పడ్డాడు. భార్య చంద్ర ప్రభ(48), కొడుకు శిఖర్(18), కూతురు(17)ను చంపిన తర్వాత అతను తన తమ్ముడికి ఫోన్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వెంటనే అపార్ట్ మెంట్ కు చేరుకున్న సుశీల్ తమ్ముడు.. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న వదిన, పిల్లల డెడ్ బాడీలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తనకు నయం కాని జబ్బు ఉన్నందున, తన వాళ్లను ఈ కష్టంలో వదిలివెళ్లలేనని, అందుకే విముక్తి కల్పించానని నోట్ లో సుశీల్ రాసినట్లు పోలీసులు చెప్పారు. హత్యకు ఉపయోగించిన సుత్తిని స్వాధీనం చేసుకున్నామని, సుశీల్ కోసం వెతుకుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.