కరీంనగర్ బల్దియా ఏఈ పై సస్పెన్షన్ వేటు

 కరీంనగర్ బల్దియా ఏఈ పై సస్పెన్షన్ వేటు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో  మెజర్ మెంట్ బుక్(ఎంబీ) మాయంపై ఎట్టకేలకు మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. 10 నెలల కింద జరిగిన ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఏఈ అబ్దుల్ గఫూర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ సిటీలోని కిసాన్ నగర్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో స్మార్ట్ సిటీ నిధులు రూ.5.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టారు.  రాక్ కటింగ్ పేరిట రూ.80‌‌‌‌ లక్షల బిల్లులు అక్రమంగా డ్రా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ బండారి వేణు, కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. 

లేని గుట్టను ఉన్నట్లుగా చూపి రాక్ కటింగ్ పేరిట రూ.80 లక్షల బిల్లు డ్రా చేసిన కారణంగానే ఆ వివరాలు ఉన్న 152 నంబర్ ఎంబీని మాయం చేశారనే ఆరోపణలు  వినిపించాయి. దీనిపై ఒత్తిడి పెరగడంతో చివరికి ఈ బుక్ పోయిందని కాంట్రాక్టర్ గత ఆగస్టులో వన్ టౌన్ పీఎస్ లో  ఫిర్యాదు చేశాడు. ఎంబీ రికార్డు పోతే సంబంధిత బల్దియా ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంపైనా అనుమానాలు వచ్చాయి. ఆ సమయంలో ఇన్ చార్జ్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ విచారణకు ఆదేశించారు. ఏఈ గఫూర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆయనే బాధ్యుడిగా తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అయితే.. బిల్లులు పొందిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటారా..? లేదా అనేది ఇప్పుడు బల్దియాలో ఆసక్తికరంగా మారింది.