- కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా
కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెన్త్ఎగ్జామ్స్ నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. సోమవారం కరీంనగర్లోని సప్తగిరికాలనీ హైస్కూల్, తిరుమల్నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన టెన్త్ ఎగ్జామ్ సెంటర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎగ్జామ్ సెంటర్లలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
ఎక్కడా చిన్న తప్పిదానికి అవకాశం ఇవ్వకుండా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన 233 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించి, మరికొన్నింటిని అధికారులకు బదిలీ చేశారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
జమ్మికుంట, వెలుగు: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈ నెల 27న జరగనున్న సీతారాముల కల్యాణం సందర్భంగా ఏర్పాటుచేసిన కల్యాణ మండపంతోపాటు భక్తుల కోసం ఏర్పాటు చేయనున్న గ్యాలరీలను పరిశీలించడంతోపాటు ట్రాఫిక్ రూల్స్పై అధికారులతో మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, అశ్విని తానాజీ వాకర్డే, ఆర్డీవో రమేశ్, ఏసీపీ మాధవి, ఎస్సై క్రాంతి కుమార్, అధికారులు పాల్గొన్నారు.
