- కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్ టౌన్, వెలుగు: గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ 225 దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.
సార్ నాకు చదువుకోవాలని ఉంది గ్రీవెన్స్లో 7వ తరగతి బాలిక అర్జీ
జగిత్యాల టౌన్, వెలుగు: ‘సార్ నాకు చదువుకోవాలని ఉంది..’ అంటూ ఓ 7వ తరగతి స్టూడెంట్ గ్రీవెన్స్లో కలెక్టర్ సత్యప్రసాద్ను వేడుకుంది. సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. జగిత్యాల పట్టణానికి చెందిన గ్రీష్మ అనే విద్యార్థి గతంలో పురాణిపేట స్కూల్లో చదివేది. వారికి నూకపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు రావడంతో అక్కడికి షిఫ్ట్ అయ్యారు. దీంతో స్కూల్ దూరమైంది. దీనికి తోడు గ్రీష్మ తల్లికి అనారోగ్యంగా ఉండడంతో ఇంటి బాధ్యతల వల్ల దూరంగా ఉన్న స్కూల్కు సరిగా వెళ్లలేకపోయింది.
ఈక్రమంలో ధరూర్ లోని స్కూల్కు వెళ్తుండగా పాత స్కూల్ నుంచి టీసీ రావడంతో ఆలస్యం కావడంతో కొత్త స్కూల్లో చేర్చుకోలేదు. దీంతో పరీక్షలు దగ్గరపడుతుండగా తనకు చదువుకునే అవకాశం కల్పించాలని గ్రీష్మ కలెక్టర్ను కోరింది. స్పందించిన ఆయన విచారణ చేయాలని డీఈవో రామును ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 74 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
