కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ సిటీలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ జూనియర్ కాలేజీ, భగత్ నగర్లోని అల్ఫోర్స్ కాలేజీల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మాల్ ప్రాక్టీస్కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 345 దరఖాస్తులను స్వీకరించారు. అంతకుముందు ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ చిత్రమిశ్రా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
