- తెరపైకి ఇండిపెండెంట్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య పేరు
- బీఆర్ఎస్, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టే ప్లాన్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మేయర్ సీటు టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. ఆ కార్పొరేషన్ను హస్తగతం చేసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి సూచనతో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. దీంతో ఒక్క రోజులోనే కరీంనగర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫలితాలు వెలువడిన రోజు బీజేపీలో చేరినట్లు ప్రకటించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ విప్పల సాయిజ్యోతి ఆదివారం మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. దీంతో బీజేపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్ల సంఖ్య 34 నుంచి 33కు చేరింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్కు మరో అడుగు దూరంలో ఆగిపోయింది.
కాంగ్రెస్ గూటికి కార్పొరేటర్లు..
కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 14 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ఆదివారం ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు విప్పల సాయి జ్యోతి, బొట్ల శ్యామల కాంగ్రెస్ గూటికి చేరారు. వీరితోపాటు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు సౌగాని కొమురయ్య, ఆకుల నందిని ఉదయ్, పర్వతం మల్లేశం సైతం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే, ఎంఐఎంకు చెందిన ముగ్గురు కార్పొరేటర్లతో పాటు ఇండిపెండెంట్గా గెలిచిన మజీద్ హుస్సేన్ మంత్రుల సమక్షంలో ఆ పార్టీ జిల్లా నేత గులాం అహ్మద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
దీంతో కాంగ్రెస్ శిబిరంలో ఉన్న కార్పొరేటర్ల సంఖ్య 23కు చేరింది. బీఆర్ఎస్ శిబిరంలో 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతోపాటు ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. వారు కూడా మద్దతిస్తే బీజేపీయేతర కూటమిలో ఉన్న కార్పొరేటర్ల సంఖ్య 33కు చేరనున్నది. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఓట్లతో 35కు చేరనున్నది.
వ్యూహాత్మకంగా మేయర్ అభ్యర్థి ఎంపిక ?
బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ మేయర్ సీటు దక్కనివ్వొద్దనే లక్ష్యంతో మంత్రులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్తోపాటు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టేందుకు పార్టీలకతీతంగా ఇండిపెండెంట్ కార్పొరేటర్నే మేయర్ అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్టు తెలిసింది.
ఇందులో భాగంగా ప్రముఖ విద్యావేత్త, 10వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్కు బీఆర్ఎస్, బీఆర్ఎస్కు కాంగ్రెస్ మద్దతిచ్చిందనే అపప్రద లేకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. ఇలా కాకుండా కాంగ్రెస్ వ్యక్తే మేయర్ కావాలంటే 46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ పేర్లను పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. డిప్యూటీ మేయర్ విషయంలో సస్పెన్స్ నెలకొన్నది.
కాంగ్రెస్ క్యాంప్
కాంగ్రెస్ కార్పొరేటర్లు 14
ఇండిపెండెంట్లు 3
ఫార్వర్డ్ బ్లాక్ 2
ఎంఐఎం 4
బీఆర్ఎస్ క్యాంప్
బీఆర్ఎస్ కార్పొరేటర్లు 9
ఇండిపెండెంట్ 1
బీజేపీ క్యాంప్
బీజేపీ కార్పొరేటర్లు 30
ఇండిపెండెంట్లు 3
