కరీంనగర్ టౌన్, వెలుగు: సీఎం కప్- 2025 పోటీల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. 44 విభాగాల్లో 55 మెడల్స్ సాధించిన కరీంనగర్ విద్యార్థులను కలెక్టర్ చిత్రా మిశ్రా అభినందించారు. విజేతలు , కోచ్ లు బుధవారం కలెక్టర్ ను కలిశారు.
సీఎం కప్ లో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ చాటినందుకు 79.4 పాయింట్లతో కరీంనగర్ జిల్లా మూడో స్థానాన్ని సొంతం చేసుకోవడం, హైదరాబాదులో మంగళవారం నిర్వహించిన సీఎం కప్ విజేతల ఎంపిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా జిల్లా క్రీడాకారులు కప్ అందుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
