బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. కర్నాటక సీఎంగా ఐదేండ్లూ సిద్ధరామయ్యే కొనసాగుతారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. తామంతా ఆయనకు సహకరిస్తామని వెల్లడించారు. పార్టీలో గ్రూప్లు కట్టడం తన రక్తంలోనే లేదని స్పష్టంచేశారు.
ఈమేరకు ఆయన నవంబర్ రివల్యూషన్, పవర్-షేరింగ్ ఒప్పందం గురించి వస్తున్న ఊహాగానాలపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘పార్టీలోని మొత్తం 140 మంది శాసనసభ్యులు నా ఎమ్మెల్యేలే. పార్టీలో గ్రూప్లు కట్టడం నా రక్తంలోనే లేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం నిర్ణయించారు. మంత్రి కావాలని కోరుకునే వారు ఢిల్లీ వెళ్లి హైకమాండ్తో సమావేశమవ్వడం కామనే. అది వారు హక్కు కూడా. అధిష్ఠానం వద్దకు వెళ్లొద్దని నేను వారిని ఆపలేను.
ఐదేండ్లూ తానే సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య చెప్పారు. ఆయనకు మేమంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేమంతా హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం" అని పేర్కొన్నారు. 2023 మేలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం పదవికి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. ఆ సమయంలో 2.5 ఏండ్ల తర్వాత శివకుమార్కు సీఎం పదవి ఇస్తారన్న ‘పవర్-షేరింగ్ ఒప్పందం’ గురించి ఊహాగానాలు వచ్చాయి.
ఇటీవల సిద్ధరామయ్య రెండున్నరేండ్ల పాలన పూర్తికావడంతో డీకే శివకుమార్ కు మద్దతిచ్చే కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార మార్పిడి గురించి అధిష్టానంతో చర్చించేందుకే వారు ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే
డీకే శివకుమార్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
