లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ

 లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ

బెంగళూరు:  అత్యాచార వీడియోల కేసులో పలువురు మహిళలపై లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్(ఎసిఎంఎం) కోర్టు జ్యుడీషియల్ కస్టడి విధించింది. 

ప్రజ్వల్ రేవణ్ణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీ జూన్ 10వ తేదీ సోమవారంతో ముగిసింది. ఈ క్రమంలో అతన్ని అధికారులు కోర్టులో హాజరుపర్చారు.  ఈ కేసులో రేవణ్ణను ఇంకా విచారించాల్సి ఉందని.. అతని కస్టడీని పొడిగించాలని సిట్ కోర్టును కోరింది. దీంతో ప్రజ్వల్ రేవణ్ణకు ఏసీఎంఎం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి విధించింది.

మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ.. హోలెనరసీపూర్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్, అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. అతనిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రెండో నిందితుడిగా ఉన్న ఆయన తండ్రి, జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ మొదట అరెస్టు అయ్యారు. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్‌పై ఆయన విడుదల అయ్యారు.